చెన్నై దాహం.. దాహం : నీళ్లు లేక అలమటిస్తున్న మహానగరం
- Subhan Ali Shaik
- Published On : May 10, 2019 / 10:10 AM IST
చెన్నైలో వాతావరణం చుక్కలు చూపిస్తుంటే, అక్కడి ప్రజలు నీటి చుక్క తాగడానికి కూడా లంచం చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వం సరఫరా చేసే మంచినీటి కులాయిలు అందరి గొంతులు తడవకముందే మూతపడుతున్నాయి. దీంతో గంటల కొద్దీ బారులు తీరిన జనం ప్రైవేట్ సంస్థల నుంచి నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు.
సాధారణంగా వాడుకునే నీటి కోసం.. 15లీటర్లకు రూ.50చెల్లిస్తున్నారు. చెన్నై నగరమంతా నీళ్లు తాగాలంటే 850మిలియన్ లీటర్ల నీరు కావాలి. కానీ, ప్రభుత్వం కేవలం 500మిలియన్ల లీటర్ల నీరు మాత్రమే సరఫరా చేయగలుగుతుంది. 4సరస్సులు గుండా నీటిని సేకరించి ప్రజలకు పంపిణీ చేసే ప్రభుత్వానికి నీరు దొరకక సతమతమవుతోంది. కేవలం ఒక సరస్సు నుంచి మాత్రమే నీరు దొరుకుతుండడంతో రెండు రోజులకొకసారి నీళ్లు విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు సాయం చేస్తుంది.
దీంతో ఒక్కో కుటుంబానికి 5బిందెల నీరు మాత్రమే దక్కుతుంది. ఐదుగురు ఉన్న ఇంటికి ఈ నీరు ఏ మాత్రం సరిపోదు. కొన్ని ప్రదేశాలలో మాత్రం కేవలం ఒక వాటర్ ట్యాంక్ మాత్రమే ఉండడంతో జనం గంటల కొద్ది బారులు తీరి నీరు తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా తయారవనున్నాయని నిపుణులు చెప్పుకొస్తు్నారు. చాలా చోట్లు మునిసిపల్ నీరు తరలించే లారీ డ్రైవర్లకు లంచాలిచ్చి నీరు తమకే చేరేలా చూసుకుంటున్నారు.
