Madhya Pradesh : ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేత-గుండెపోటుతో మృతి
ఎన్నికల్లో ఓడిపోయానని తెలుసుకున్న ఒక కాంగ్రెస్ నేత గుండెపోటుతో మరణించారు.
- chvmurthy
- Published On : July 17, 2022 / 08:34 PM IST
Madhya Pradesh Congress
Madhya Pradesh : ఎన్నికల్లో ఓడిపోయానని తెలుసుకున్న ఒక కాంగ్రెస్ నేత గుండెపోటుతో మరణించారు. ఇటీవల మధ్యప్రదేశ్లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్లు, 298 నగర్ పరిషత్లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా, జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఎన్నికల ఓట్లు ఈరోజు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
ఎన్నికల్లో భాగంగా రేవా జిల్లాలోని హనుమానా నగర పరిషత్ లోని వార్డు నంబర్ 9 లో పోటీ చేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా(45) కేవలం 14 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇండిపెండెంట్ అభ్యర్ధి అఖిలేష్ గుప్తా చేతిలో ఓడిపోవటంతో గుప్తా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దిసేపటికే ఇండిపెండెంట్ అభ్యర్ధి ఆధిక్యంలో ఉన్నారు. ఫలితాలు తెలుస్తున్నప్పటి నుంచి హరినారాయణ అసౌకర్యానికి గురయ్యారు. ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితం ప్రకటించే సరికి ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఉదయం 11-30 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించినట్లు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి నవీన్ దూబే తెలిపారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read :Parliament: రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. ఈ బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
