Chaitanyananda: ఢిల్లీలోని శ్రీ శారద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి(ఢిల్లీ బాబా)పై 17 మంది విద్యార్థినులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. 62 ఏళ్ల వయసులోనూ ఆ బాబా ప్రదర్శించిన లీలలు అన్నీఇన్నీ కాదని అతడి వాట్సాప్ చాటింగ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
విద్యార్థులు, సిబ్బంది అనుమతి లేకుండా స్వామి చైతన్యానంద సరస్వతి రహస్యంగా వారి ఫొటోలను తీసినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. డిలీట్ చేసిన మెసేజ్లను కూడా ఫోరెన్సిక్ నిపుణులు తిరిగి పొందగలిగారు. ఆ బాబా ఫోన్లో చాలా మంది యువతుల ప్రొఫైల్ ఫొటోలు ఉన్నట్లు కనుగొన్నారు.
స్వామి చైతన్యానంద సరస్వతి తన చాట్లలో విద్యార్థినులు, మహిళా సిబ్బందిని “బేబీ,” “డాటర్ డాల్” అని పిలిచాడు. “నాతో కలిసి నిద్రించాలి” అని ఒత్తిడి చేసినట్లు వాటి ద్వారా తేలింది. ఒక చాట్లో ఓ విద్యార్థినిని “దుబాయ్ షేక్తో పడుకో” అని ఆదేశించినట్లు తెలుస్తోంది.
రాజకీయ పరిచయాలను ఉపయోగించుకొని ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కూడా అమ్మాయిలను అతడు ఆకర్షించాడని సమాచారం.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్లోని కార్యాలయాన్ని “వేధింపుల గది”గా ఉపయోగించి చాలా మంది అమ్మాయిలను స్వామి చైతన్యానంద సరస్వతి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులు ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పకుండా, అలాగే వారు ఆశ్రమం వదిలి వెళ్లకుండా స్వామి చైతన్యానంద సరస్వతి చేశాడు. విద్యార్థినుల ఒరిజినల్ సర్టిఫికేట్లను అతడి వద్దే ఉంచుకుని, వాటికి ఇవ్వబోనని బెదిరించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పోలీసులు సోమవారం ఆ ఆశ్రమ నిర్వాహకుడిని వసంత కుంజ్ ఇన్స్టిట్యూట్కు తీసుకెళ్లి, అక్కడి ప్రైవేట్ కార్యాలయం, నివాసం, మహిళా విద్యార్థులను వేధించిన గదిని చూపించాలని చెప్పారు. ఈ ఇన్స్టిట్యూట్ శృంగేరి శారదా పీఠం నిర్వహణలో ఉంది.
స్వామి చైతన్యానంద సరస్వతికి గతంలో స్వామి పార్ధసారథిగానూ పేరు ఉంది. ఇతడు ఇన్స్టిట్యూట్లో పని చేసిన మహిళా సిబ్బందిని ఉపయోగించుకుని ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ కింద చదువుతున్న విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని తెలుస్తోంది.
స్వామి చైతన్యానంద సరస్వతి లండన్ నంబర్లతో వాట్సాప్ ఉపయోగించి ట్రాకింగ్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఐపీ అడ్రస్ ద్వారా కనుగొని ఆగస్టు 28న ఉదయం 3.30 గంటలకు ఆగ్రాలోని ఒక హోటల్లో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతని ఫోన్లో చాలా మంది మహిళలతో చేసిన చాట్లు దొరికాయి.
విచారణలో, బాధితులను ఆధ్యాత్మిక యాత్ర పేరిట ఆల్మోరా, రుషికేశ్లకు తీసుకెళ్లినట్లు స్వామి చైతన్యానంద సరస్వతి అంగీకరించాడు. అయితే, తిరిగి ప్రయాణంలో వారిపై లైంగిక దాడులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ఒక చాట్లో బాధితురాలిని “ఒకరిని ఆకర్షించు” అని ఆదేశించాడు ఆ స్వామీజీ. ఆ వ్యక్తి ఆన్లైన్లో డబ్బు చెల్లించిన తర్వాత, “అతడిని కౌగిలించుకుని ఆ ఫొటోను నాకు పంపు” అని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.