Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఢిల్లీలో శనివారం (ఏప్రిల్ 16) కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మరణించారు. గత 24 గంటల్లో COVID-19 పాజిటివిటీ రేటు 5.33 శాతంగా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే 26 శాతం కరోనా పాజిటివిటీ పెరిగింది. ప్రతి 100 కరోనా పరీక్షలకు నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్యను పాజిటివిటీ రేటు అంటారు. ఈ నెల 10 నుంచి 15 వరకు గత ఐదు రోజుల్లో కరోనా కేసులతోపాటు పాజిటివిటీ రేటు 3 రెట్లు పెరిగాయి. ఈ నెల 10న 141 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ శాతం 1.29గా నమోదైంది. శుక్రవారం నాటికి కొత్త కరోనా కేసుల సంఖ్య 366కు చేరింది.
కరోనా పాజిటివ్ రేటు 3.95కు పెరిగింది. ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. పాఠశాల విద్యార్థుల్లో ఆందోళనకు దారితీసింది. కోమోర్బిడిటీలు ఉన్న 12 ఏళ్లలోపు పిల్లలకు కూడా కరోనా టీకాలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో ఎవరికైనా కరోనా సోకినప్పుడు లేదా పాఠశాలలోని కరోనా ప్రభావం ఉన్న ప్రాంతంలో వెళ్లిన సందర్భాలలో మాత్రమే స్కూల్ మొత్తం ప్రాంగణాన్ని మూసివేయడానికి నిర్ణయం తీసుకోవచ్చునని సూచించారు. కరోనా కేసులు గుర్తించిన నిర్దిష్ట విభాగం లేదా తరగతి గదులను మాత్రమే తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు చేశారు. నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతాలను కూడా హై అలర్ట్ చేసింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దేశ రాజధానిలో కోవిడ్ కేసులు పెరిగినప్పటికీ.. ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీనిపై నగర వాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తమ పిల్లలను పాఠశాలకు పంపవద్దని తల్లిదండ్రులను కోరినట్లు ఓ నివేదిక సూచించింది. అవసరమైతే తప్పా తరగతి గదులను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం పాఠశాల అధికారులకు సూచనలు చేసింది.
Read Also : Delhi Covid Cases : ఢిల్లీలో కరోనా విజృంభణ.. నిఘా పెంచాం.. ఆందోళన చెందొద్దు : మనీష్ సిసోడియా