plasma to patient-Mosambi juice
plasma to patient-Mosambi juice : డాక్టర్లు, బ్లడ్ బ్యాంక్ చేసిన నిర్వాకానికి ఓ రోగి ప్రాణాలు కోల్పోయాడు. డెంగ్యూ సోకిన రోగికి ప్లాస్మా ఎక్కించాల్సి ఉండగా ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్ ఎక్కించారు. దీంతో సదరు రోగి చనిపోయాడు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ విచారణకు ఆదేశించారు.
అక్టోబర్ 17న ప్రదీప్ పాండే అనే వ్యక్తి డెంగ్యూతో బాధపడుతూ.. ప్రయాగ్రాజ్లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. అతడికి ప్లాస్మా ఎక్కించాలని డాక్టర్లు చెప్పటంతో సమీపంలోని బ్లడ్ బ్యాంకును ప్లాస్మా కోసం సంప్రదించారు. దీంతో బ్లడ్బ్యాంకు సిబ్బంది ప్లాస్మా బ్యాగ్లో బత్తాయి రసం నింపి ఇచ్చారు. అది పట్టుకెళ్ళి రోగి బంధువులు డాక్టర్లకు ఇవ్వటంతో డాక్టర్లు దాన్ని పరిశీలించకుండానే రోగికి ఎక్కించారు. దీంతో ప్రదీప్ పాండే మరణించాడు.
ఈ విషయం తెలిసిన మృతుడి బంధువులు ఒకరు బత్తాయి రసం ఉన్న బ్లడ్ బ్యాగును చూపుతూ ఓ వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేయటంతో కలకలం రేగింది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఆసుపత్రిలోని రోగులందరినీ వైద్య చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించడంతోపాటు జిల్లా యంత్రాంగం దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల కమిటీని ఆదేశించింది. విచారణ కోసం సదరు మోసంబి జ్యూస్ బ్యాగ్ ను పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. దీంతో హాస్పిటల్ కు సీల్ వేశారు. డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.