Didi Put Your Foot Over My Head And Kick Me But Not Bengals Development
Didi వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం(మార్చి-21,2021)బంకురాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ర్యాలీకి హాజరైన ప్రజలను చూస్తేంటే మే-2న బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమైపోయినట్లు తెలుస్తోందని ప్రధాని అన్నారు. టీఎంసీని ఓడించాలని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారన్నారు. బ్రిగేడ్ గ్రౌండ్తో పోటీ పడుతున్నట్టుగా ఎక్కడ చూసినా జనమే తన కంటికి కనపిస్తున్నారంటూ సభికులను ప్రధాని ఉత్సాహపరిచారు.
మోడీ మాట్లాడుతూ…దీదీ,గడిచిన 10ఏళ్లల్లో కేవలం ఉత్తుత్తి హామీలు ఇవ్వడానికే మీరు పరిమితమయ్యారు. మీరు చేసిన పనులేమిటో చెప్పండి?మీరు ప్రతిసారి “ఖేలా హోబే”(ఆట మొదలైంది)అని చెబుతున్నారు. కానీ బెంగాల్ ప్రజలు ఖేలా శేష్ హోబే(ఆట ముగిసింది)అని చెప్పబోతున్నారు. మమత కాలితో నా తలపై తన్నుతున్నట్లుగా మరియు ఫుట్ బాల్ ఆడుతున్నట్లుగా బెంగాల్ వీధుల్లో గోడలపై దీదీ మనుషులు చిత్రాలు రూపొందుస్తున్నారు. దీదీ, ఎందుకు మీరు బెంగాల్ సంస్కృతీ, సంప్రదాయాన్ని అవమానిస్తున్నారు? దీదీ,కావాలనుకుంటే మీరు నా తలపై మీ కాలిని పెట్టండి మరియు నన్ను తన్నంది. కానీ దీదీ, బెంగాల్ అభివృద్ధి మరియు ప్రజల ఆకాంక్షలను తన్నేందుకు నేను మిమ్మల్ని అనుమతించను. మమతకు ఎక్కువగా కోపం వస్తోంది. నా మొఖం నచ్చట్లేదని ఇప్పుడు మమత చెబుతోంది. దీదీ,ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ ముఖ్యం కానీ ముఖం కాదు అని మోడీ చమత్కరించారు.
బీజేపీ పథకాలతో నడుస్తోంటే.. టీఎంసీ మాత్రం కుంభకోణాలతో నడుస్తోందని ప్రధాని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్, పీఎం-కిసాన్ పథకం, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను బెంగాల్ ప్రజలకు చేరువ కాకుండా మమత అడ్డుకున్నారని మోడీ మండిపడ్డారు. దీదీ ప్రభుత్వం పదేళ్లు బంగాల్ ప్రజలతో ఆడుకుంది.. కానీ ఇప్పుడు వారి ఆటలు పూర్తయ్యాయని అన్నారు. పదేళ్ల క్రితమే మమత అసలు రంగు బయటపడుంటే.. బెంగాల్ ప్రజలు ఆమెను ఎన్నుకునేవారు కాదని అన్నారు. నిజమైన అభివృద్ధి(అసోల్ పరివర్తన్) త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. మే-2 తర్వాత బెంగాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల్లో ఓడిపోతానని గ్రహించిన మమత.. ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.