Train
Railway Staff Saves Senior Citizen మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కల్యాణ్ స్టేషన్ వద్ద ఓ రైలు డ్రైవర్ చాకచక్యం కారణంగా వృద్ధుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆదివారం మధ్యాహ్నాం 12:45గంటల సమయంలో కల్యాణ్ స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెం.4 నుంచి ముంబై-వారణాశి రైలు స్టార్ట్ అయ్యింది. అయితే ఇదే సమయంలో హరి శంకర్ అనే 70ఏళ్ల వృద్ధుడు లోకోమోటివ్ రైలు ట్రాక్ను దాటుతున్న సమయంలో కింద పడిపోయాడు.
అయితే ఇది గమనించిన చీఫ్ పర్మెనెంట్ వే ఇన్స్ పెక్టర్(CPWI)సంతోష్ కుమార్..వెంటనే రైలు ఆపమని లోకోపైలట్లకు సిగ్నల్ ఇచ్చారు. దీంతో వెంటనే లోకోపైలట్లు అత్యవసర బ్రేకులు వేశారు. అయితే అప్పటికే రైలుముందుభాగం కింద ఇరుక్కున్నాడు హరిశంకర్. వెంటనే రైలు దిగిన లోకోపైలట్ ఎస్కే ప్రధాన్, అసిస్టెంట్ పైలట్ రవిశంకర్..రైలు ముందుభాగంలో ఇరుక్కున్న బాధితుడిని బయటకు తీశారు.
కాగా,అత్యవసర బ్రేకులు వేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ఇద్దరు లోకో పైలట్లకు,CPWIకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అలోక్ కన్సాల్.