Maharashtra Lockdown : మహారాష్ట్రలో పూర్తిస్థాయి లాక్ డౌన్!
కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిలాడుతోంది. కర్ఫ్యూ విధించినా ఫలితం లేకుండా ఉంది. దీంతో కఠినమైన లాక్డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
- bheemraj
- Updated on- April 21, 2021 / 08:41 AM IST
Maharashtra Lockdown
Full lockdown in Maharashtra : కరోనా ధాటికి మహారాష్ట్ర విలవిలాడుతోంది. కర్ఫ్యూ విధించినా ఫలితం లేకుండా ఉంది. దీంతో కఠినమైన లాక్డౌన్ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన మహారాష్ట్ర కేబినెట్.. పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేసేందుకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. అయితే కఠిన ఆంక్షలపై మాత్రం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ ప్రకటన చేస్తారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు.
కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా 10వ తరగతి పరీక్షలు రద్దు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అంతేకాకుండా ఆసుపత్రుల్లో సరిపడా ఆక్సిజన్ను అందుబాటులో ఉంచేందుకు పలు చర్యలు చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా పవర్ప్లాంట్లు తయారు చేసే ఆక్సిజన్ను వినియోగించుకోవాలని నిర్ణయించామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్ వెల్లడించారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ, పగటిపూట 144 సెక్షన్, వారాంతంలో పూర్తిస్థాయి లాక్డౌన్ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ చాలా మంది ప్రజలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. దీంతో కఠినమైన లాక్డౌన్ అమలు చేసేందుకు మంత్రులందరూ మొగ్గుచూపారని మంత్రి రాజేష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యతపై ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోప్ స్పందించారు. నిత్యం 15 వందల 50 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిర్వహణను చేపట్టామన్నారు. ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇక ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలకు అంబులెన్స్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే వెల్లడించారు. అయితే మహారాష్ట్రలో పూర్తి లాక్డౌన్ విధిస్తే పొరుగు రాష్ట్రాలపై ప్రభావంపడే అవకాశం ఉంది.
