ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ వివాదంలో చిక్కకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. హింసాత్మక ఘటనల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా 19 మంది చనిపోగా, వెయ్యి మందికి పైగా అల్లర్ల కేసుల్లో అరెస్ట్ అయ్యారు.
కాగా ఆందోళనల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు మీరట్ ఎస్పీ అఖిలేష్ నారాయణ్ సింగ్ స్వయంగా రంగంలోకి దిగారు. వీధుల్లో కలియ తిరిగారు. ఈ క్రమంలో ఓ ప్రాంతంలో ఆగిన ఎస్పీ.. అక్కడే ఉన్న కొందరు ముస్లిం యువకులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు అని ఎస్పీ వారిని ప్రశ్నించారు. ఈ వీధిని నేను చక్కదిద్దుతాను అని అన్నారు. మేము నమాజ్ చేసుకోవడానికి మసీదుకి వెళ్తున్నామని ఆ యువకులు ఎస్పీకి బదులిచ్చారు. అది.. సరే.. మరి మీ దుస్తులపై నలుపు, నీలం రంగు బ్యాడ్జులు ఎందుకు ఉన్నాయి అని ఎస్పీ ప్రశ్నించారు. మీరంతా పాకిస్తాన్ వెళ్లిపోండి అని అన్నారు.
భారత దేశంలో ఉండాలని ఇష్టం లేకపోతే వెంటనే వెళ్లిపోండి అని ఎస్పీ అన్నారు. ఎక్కడెక్కడో వాళ్లంతా వచ్చి భారత దేశంలో ఉంటున్నారు అని సీరియస్ అయ్యారు. అంతటితో ఎస్పీ ఆగలేదు. ప్రతి ఇంట్లో నుంచి ఒక్కొక్కరిని తీసుకెళ్లి జైల్లో పెడతాను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. అందరి అంతు చూస్తాను అని సీరియస్ గా అన్నారు. ఎస్పీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. వివాదానికి దారితీశాయి. ఎస్పీ తీరుపై విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎస్పీ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని స్థానికులు డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సీఏఏ చట్ట వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్ధం అని చెబుతున్నారు. ప్రజల జీవించే హక్కుని హరించేలా ఈ చట్టం ఉందని ముస్లిం వర్గాలు ఆరోపిస్తున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హింసలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లతో సంబంధం ఉందనే ఆరోపణలలతో 1,113 మందిని అరెస్ట్ చేశారు. 327 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 5,558 మందిని ముందస్తు అరెస్ట్లు చేశారు.