Madhya Pradesh: తలపై గాయం.. కండోమ్ ప్యాకెట్తో కట్టు కట్టిన వైద్య సిబ్బంది
తలకు గాయమై రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు కండోమ్ ప్యాకెట్తో డ్రెస్సింగ్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అధికారులు స్పందించారు.
- Narender Thiru
- Published On : August 20, 2022 / 04:11 PM IST
Madhya Pradesh: ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది ఈ సంఘటన. తలకు గాయమై ఆస్పత్రికి వచ్చిన మహిళకు, రక్త స్రావం కాకుండా కండోమ్ ప్యాకెట్తో డ్రెస్సింగ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో జరిగింది. ధరమ్ఘడ్కు చెందిన రేష్మా బాయ్ అనే మహిళ తలకు గాయమై, రక్తస్రావం అవుతున్న స్థితిలో మోరెనాలోని పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చింది.
Boycott Amazon: అభ్యంతరకర కృష్ణుడి చిత్రాలు అమ్ముతున్న అమెజాన్.. బాయ్కాట్ చేస్తామంటున్న నెటిజన్స్
అయితే ఆమెకు వైద్యం చేయాల్సిన డాక్టర్ ధర్మేంద్ర రాజ్పుత్, ఎమర్జెన్సీ డ్యూటీ ఉండటంతో త్వరగా వెళ్లిపోయాడు. వెళ్తూవెళ్తూ.. ఆమె తల నుంచి తాత్కాలికంగా రక్తస్రావం ఆగేందుకు ఏదైనా కార్డు బోర్డు లాంటి మెటీరియల్తో కట్టుకట్టమని వార్డు బాయ్కు సూచించాడు. దీంతో ఏం చేయాలో తెలియని వార్డు బాయ్.. కాటన్ ప్యాడ్ తలపై పెట్టి, దానిపై కండోమ్ ప్యాకెట్ ఉంచి కట్టుకట్టాడు. తర్వాత ఆమె అక్కడ్నుంచి అదే స్థితిలో జిల్లా ప్రధాన ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
Revanth Reddy: తెలంగాణ ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్సే: రేవంత్ రెడ్డి
అయితే, ఆమెకు కండోమ్ ప్యాకెట్తో కట్టుకట్టిన విషయం ఫొటోలతో సహా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో జిల్లా వైద్యాధికారులు స్పందించారు. ఆమెకు కండోమ్ ప్యాకెట్తో డ్రెస్సింగ్ చేసిన వార్డు బాయ్ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.
