Farmers Chalo Delhi : ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈనెల 13న ఛలో ఢిల్లీకి రైతులు పిలుపునివ్వడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలు పెట్టారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై మేకులను పోలీసులు ఏర్పాటు చేశారు. రైతుల ఛలో ఢిల్లీ పిలుపుతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఏడు జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఇప్పటికే నిలిపివేసింది. పంటలకు కనీస మద్దతు ధర పై 2020లో కేంద్రం రూపొందించినటువంటి చట్టంపై రైతులు అప్పట్లో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిపై పెట్టిన కేసుల కొట్టివేత, ఇతర డిమాండ్లతో ఈనెల 13న పార్లమెంట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు పంజాబ్, హర్యానా రైతులు పిలుపునిచ్చారు.
Also Read : రెండు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతియేటా డీఎస్సీ నిర్వహిస్తాం
రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేబాద్, సిస్రా జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. రైతులను నిలువరించేందుకు అంబాలా జిల్లాలో ఢిల్లీకి వెళ్లే రహదారిపై బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూడంచెల కట్టడి చర్యలను అమలు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలోని రైతులు గురువారం పార్లమెంట్ ముట్టడికి బయలుదేరగా.. ఢిల్లీ శివారులోని వారిని కట్టడి చేశారు. ర్యాపిడ్ యాక్షన్ బృందాలను రంగంలోకి దింపి ప్రతీఒక్కరిని తనిఖీ చేసి నగరంలోనికి అనుమతించారు.