Kejriwal attacks BJP over rewdi comments
Arvind Kejriwal: కొత్త కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, గణేశుడి ఫొటోలు ముద్రించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… కొత్త నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ ఫొటో, మరోవైపు లక్ష్మీ దేవి, వినాయకుడి ఫొటోలు ఉండాలని ఆయన అన్నారు. ఆ ఇద్దరు దేవుళ్ల ఫొటోలను కరెన్సీపై ముద్రిస్తే దేశ శ్రేయస్సుకు ఉపయోగకరమని చెప్పారు.
కొన్ని సార్లు మనం పలు పనుల విషయంలో ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడి అనుగ్రహం లేనిదే ఫలించవని అన్నారు. ముస్లిం దేశమైన ఇండొనేషియాలో కరెన్సీపై గణేశుడి బొమ్మ ఉంటుందని గుర్తుచేశారు. మరి మన కరెన్సీపై ఎందుకు ఉండకూడదని నిలదీశారు. ఈ విషయంపై తాను త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని అన్నారు.
అమెరికా డాలర్ తో పోల్చితే భారత రూపాయి మారకం విలువ రోజురోజుకీ క్షీణించిపోతోందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచాలంటే మన ప్రయత్నాలు చేస్తూనే, సర్వశక్తిమంతుడైన భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందాలని వ్యాఖ్యానించారు. కాగా, దీపావళి నాడు గతంలోలా భారీ స్థాయిలో కాలుష్యం జరగకుండా ప్రజలు మంచి సహకారాన్ని అందించారని చెప్పారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..