ICSE, ISC Results : ఐసీఎస్ఈ(ICSE) పదో తరగతి, ఐఎస్సీ(ISC) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. 10, 12వ తరగతులకు సంబంధించి ఈసారి ఎలాంటి మెరిట్ లిస్టును విడుదల చేయడం లేదని బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఐసీఎస్ఈ పదో తరగతిలో 99.98శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఐఎస్సీ 12వ తరగతిలో 99.76శాతం నమోదైంది. భారత పాఠశాల విద్య ధ్రువీకరణ పరీక్షల మండలి (CISCE) శనివారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేసింది.
దాదాపు మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్న ఈ ఫలితాలను cisce.org, results.cisce.org సైట్లలో అందుబాటులో ఉంచారు. అలాగే SMS ద్వారా ఫలితాలు పొందొచ్చు. సీఐఎస్సీఈ ఫలితాలను తెలుసుకొనేందుకు ఐసీఎస్ఈ విద్యార్థులైతే ICSE (Unique ID) టైప్ చేసి 09248082883 నంబర్కు పంపాలి. అలాగే, ఐఎస్సీ 12వ తరగతి విద్యార్థులైతే ISC (unique ID) టైప్ చేసి 09248082883 నంబర్ కి పంపి ఫలితాలు పొందొచ్చు.
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగడంతో ఐసీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటించారు. నిష్పాక్షిక, పారదర్శక విధానంలో విద్యార్థుల ప్రతిభను మదింపు వేసి ఫలితాలను ప్రకటించారు. ఫలితాలు, కేటాయించిన మార్కులకు సంబంధించి విద్యార్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యంతరాలను తెలియజేయడానికి ఆగస్టు 1 వరకు గడువు ఇస్తున్నట్టు సీఐఎసీఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫలితాలతో ఎవరైనా సంతృప్తి చెందకపోతే వారికి మళ్లీ పరీక్షలు రాసే అవకాశం ఇచ్చారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాక పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే బోర్డు స్పష్టంచేసింది.