One Nation.. One Ration Card: ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ పథకాన్ని 2021 జూలై 31వ తేదీలోగా దేశంలోని అన్నీ రాష్ట్రాలు అమలు చెయ్యాలంటూ కీలక ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. ఈ పథకం కింద వలస కార్మికులకు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకునే సౌకర్యం కల్పించాలి ప్రభుత్వాలు. వలస కార్మికుల ప్రయోజనం మరియు సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఈమేరకు ఉత్తర్వులు ఇచ్చింది.
కరోనా కారణంగా వలస కార్మికుల సంక్షేమానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. వలస కార్మికులకు పొడి రేషన్ అందించాలని, మహమ్మారి కొనసాగే వరకు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ కిచెన్లను కూడా అందుబాటులోకి తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో, అసంఘటిత రంగంలో కార్మికుల నమోదును నేషనల్ డేటా గ్రిడ్ పోర్టల్లో నమోదు చెయ్యాలని, ఈ పనిని జూలై 31 లోగా పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. దీనికోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సహకారాన్ని తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో విధించిన ఆంక్షల వల్ల తీవ్రంగా నష్టపోయిన వలస కార్మికులకు ఆహార భద్రత, నగదు బదిలీ మరియు ఇతర సంక్షేమ చర్యలను నిర్ధారించాలని కేంద్రానికి, రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. గతేడాది మేలో వలస కార్మికుల సమస్యలు, కష్టాలను ఉన్నత న్యాయస్థానం గుర్తించి పలు ఆదేశాలు జారీచేసింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్ పథకాన్ని అమలు చేయాలని కేంద్రం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ధర్మాసనం కోరింది. తద్వారా వలస కార్మికులు ఇతర రాష్ట్రాల్లో పనిచేసే ప్రదేశాలలో రేషన్ పొందే అవకాశం ఉంటుంది.