LPG Tanker : గుడ్న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరబోతున్నాయ్.. హర్మూజ్ను దాటేసిన భారత నౌక.. ఎన్ని మెట్రిక్ టన్నుల ఎల్సీజీ వస్తుందో తెలుసా?
LPG Tanker : పశ్చిమాసియా ఉధ్రిక్తతల వేళ భారత్ కు రావాల్సిన ఓ ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని దాటేసింది. మార్షల్ దీవుల జెండా గల ఎంటీ సర్వ్ శక్తి నౌక 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో భారత్ వైపు వస్తోంది.
- Harish Thanniru
- Published on- May 2, 2026 / 09:27 PM IST
India-bound Sarva Shakti LPG tanker passes through Strait of Hormuz
LPG Tanker : పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద ఆంక్షలు విధించారు. ఇటీవల అమెరికా నౌకలు జలసంధిని దిగ్భందం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్ రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. దీంతో దేశంలో ప్రజలను చమురు, గ్యాస్ కొరత వేధిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా.. కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా పెంచింది. గ్యాస్ కొరత నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా కేంద్రం ఓ శుభవార్త చెప్పింది.
పశ్చిమాసియా ఉధ్రిక్తతల వేళ భారత్ కు రావాల్సిన ఓ ఎల్పీజీ నౌక హర్మూజ్ జలసంధిని దాటేసింది. మార్షల్ దీవుల జెండా గల ఎంటీ సర్వ్ శక్తి నౌక 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో భారత్ వైపు వస్తోంది. ఈ నౌక మే 13వ తేదీ నాటికి విశాఖ తీరానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికా నౌకల దిగ్భందనం తరువాత భారత్ కు చేరుకున్న తొలి ఎల్పీజీ నౌక ఇదేకానుంది. ఈ నౌకలో 20మంది సిబ్బంది ఉండగా.. వారిలో 18మంది భారతీయులు ఉన్నారు.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ సరుకును కొనుగోలు చేసింది. అయితే, ఈ విషయాన్ని కంపెనీ ఇప్పటి వరకు ధృవీకరించలేదు.
భారతదేశం వంటగ్యాస్ అవసరాల్లో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందులో ఎక్కువ భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. దీనివల్ల హర్మూజ్ జలసంధి మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా దేశంలో గ్యాస్ సరఫరా నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. మరీముఖ్యంగా ఇటీవల అమెరికా నౌకలు హర్మూజ్ ను దిగ్భందనం చేశాయి. ఈ పరిస్థితుల్లో అటువైపుగా ఒక్క నౌక రావడానికి వీలులేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్తో కూడిన నౌక భారత్కు రావడం కీలకంగా మారింది.
ఎల్పీజీ గ్యాస్ తో వస్తున్న నౌక భారతదేశానికి చేరుకుంటే ప్రస్తుతం దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభానికి కొంత ఉపశమనం లభించినట్లవుతుంది. దేశంలో వంటగ్యాస్ సరఫరాను స్థిరంగా ఉంచడంలో ఇది పెద్దపాత్ర పోషిస్తుందని చెబుతు్ననారు.
