భారత్‌లో 24గంటల్లో 10వేల కరోనా కేసులు నమోదు

  • Publish Date - June 5, 2020 / 05:06 AM IST

ఇండియాలో శరవేగంగా కరోనా వైరస్ విజృంభిస్తుండగా.. మొత్తం పాజిటివ్ కేసులు ఇప్పటికే 2 లక్షలు దాటిపోయాయి. దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే కేసుల సంఖ్య రెండు లక్షలు దాటగా.. పరిస్థితి తీవ్రంగా మారిపోయాయి. భారత్‌లో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోండగా.. దేశంలో రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి.

నిన్న ఒక్కరోజే అత్యధికంగా దాదాపు 10వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. భారత్‌లో కరోనా వైరస్‌ బయటపడిన తర్వాత మొట్టమొదటిసారిగా 24గంటల్లో 9851 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,26,770కి చేరుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.

గత కొన్నిరోజులుగా దేశంలో ప్రతి రోజు 200పైగా కొవిడ్‌ మరణాలు సంభవిస్తుండగా.. గడచిన 24గంటల్లో దేశంలో అత్యధికంగా 273మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కొవిడ్‌ సోకి చనిపోయినవారి సంఖ్య 6348కి చేరుకుంది. దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకోగా మరో 1,10,960 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదు అవుతున్న దేశాల జాబితాలో భారత్‌ 7వ స్థానంలో ఉంది.

Read: ఢిల్లీ మెట్రోలో 20మందికి కరోనా పాజిటివ్