INS Vikrant: పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ను రంగంలోకి దింపింది.
ఐఎన్ఎస్ విక్రాంత్ను అరేబియా సముద్రంలో మోహరించింది భారత నౌకాదళం. కర్నాటకలోని కర్వార్ తీరంలో ఈ నౌక పహారా కాస్తోంది. పాకిస్తాన్ అరేబియా సముద్రంలో మిసైల్స్ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిస్పందనగా.. భారత్ ఐఎన్ఎస్ విక్రాంత్ను కర్వార్ తీరం వద్ద మోహరించింది.
ఈ నౌక 262 మీటర్ల పొడవు, 45 వేల టన్నుల బరువు కలిగి ఉండి.. 28 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. పాక్ లోని కరాచీ, గ్వాదర్ వంటి ఓడరేవులను ఐఎన్ఎస్ విక్రాంత్ సులభంగా టార్గెట్ చేసుకోగలదని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్లో మిగ్-29కే యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ నౌకాదళాన్ని బలహీనపరచడంతో పాటు సముద్ర మార్గాలను 60శాతం వరకు అడ్డుకోగల సామర్థ్యం కలిగి ఉందని అంచనా వేస్తున్నారు.
కొచ్చి నౌకాశ్రయంలో నిర్మించిన ఈ వాహక నౌకను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2022న జాతికి అంకితం చేశారు. ఇది స్వదేశీ సంస్థ నిర్మించిన తొలి దేశీయ విమాన వాహక నౌక. 2022 వరకు భారత్ వద్ద ఒకే ఒక్క విమాన వాహక నౌక అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇండియన్ నేవీకి ఇలాంటివి రెండు ఉన్నాయి. దీంతో సొంతంగా విమాన వాహక నౌకలను నిర్మిస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా చైనా వంటి దేశాల సరసన భారత్ కూడా చేరినట్లయింది.
Also Read: పాకిస్థాన్ ఆర్మీలో భయమా? తిరుగుబాటా?.. సంచలనం సృష్టిస్తున్న లేఖలు.. వైరల్
భారత్లో నిర్మించిన ఈ నౌకకు 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఐఎన్ఎస్ విక్రాంత్ పేరే పెట్టారు. 30 యుద్ధ విమానాలను నిలిపేంత ఈ విశాల విమాన వాహక నౌక ఇది.
నౌక పొడవు: 262 మీటర్లు
సామర్థ్యం: 45 వేల టన్నులు
గరిష్ఠ వేగం: 28 నాట్స్
మొత్తం వ్యయం: రూ.20 వేల కోట్లు
మిగ్-29కే ఫైటర్ జెట్లు
కమోవ్-32
ఎంహెచ్-60 ఆర్ హెలికాప్టర్లు
దేశీయంగా తయారైన ఏఎల్హెచ్ (అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు)
ఎల్సీఏ (లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్) విమానాలతో సహా 30 రకాల విమానాలను మోసుకెళ్లేలా దీన్ని రూపొందించారు.
విక్రాంత్ నౌక ఆటోమేటిక్ వ్యవస్థలతో నిర్మితమైంది.
విమానాలు, హెలికాప్టర్ల రాకపోకలకు అనువుగా దీన్ని నిర్మించారు.
ఈ యుద్ధనౌకలో మొత్తం 18 డెక్లు, 2వేల 400 గదులు ఉన్నాయి.
1,600 మంది సైనికులు కూర్చోవచ్చు.
భారత్ వద్ద ప్రస్తుతం రెండు విమాన వాహక నౌకలు ఉన్నాయి. ఒకటి విక్రమాదిత్య, మరొకటి విక్రాంత్. ఈ నౌకలను హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో భద్రతా ప్రయోజనాల కోసం వినియోగిస్తారు.