J&K All-Party Meeting: జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి ఆ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని నరేంద్ర మోదీ సూచించారు. నియోజకవర్గాల స్థాయి నుంచి పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని పిలుపునిచ్చారు. దిల్లీలోని మోదీ అధికార నివాసంలో జమ్మూ-కశ్మీర్ అఖిలపక్ష నేతలతో భేటీ అయ్యారు మోదీ. పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్, భాజపా సహా ఎనిమిది పార్టీలకు చెందిన 14 మంది నేతలు ఇందులో పాల్గొన్నారు.
2019 ఆగస్టు 5న అధికరణం 370 రద్దయిన తర్వాత జమ్మూ-కశ్మీర్ నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన తొలి భేటీ కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. మూడున్నర గంటలకు పైగానే సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే జమ్మూ-కశ్మీర్ నేతల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దాదాపు అంగీకరించింది. ముందుగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగితేనే సాధ్యమవుతుందని చెప్పేసింది.
భేటీ అనంతరం ప్రధాని మోదీ వరుసగా పలు ట్వీట్లు చేస్తూ..‘జమ్మూ-కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి సంప్రదింపుల ప్రక్రియ కీలకమైన ముందడుగు. జమ్మూ-కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పార్లమెంటులో ఇచ్చిన రాష్ట్ర హోదా పునరుద్ధరణ హామీ సాకారానికి నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు, ప్రశాంతంగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కీలక అంశాలు’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్వీట్లో వెల్లడించారు.
సమావేశంలో పాల్గొన్న నేతలు రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను వ్యక్తం చేయడం హర్షణీయమని ఆయన మరో ట్వీట్లో పేర్కొనడం విశేషం.