కొత్త పార్లమెంట్ భవనంలో లేడీస్ వాష్రూంలు భయంకరంగా ఉన్నాయని సమాజ్వాదీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ సంచలన ఆరోపణ చేశారు. 143 మంది పార్లమెంట్ ఎంపీలను సస్పెండ్ చేయడంపై పార్లమెంట్ బయట విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఆ ఆందోళనలో పాల్గొన్న జయా బచ్చన్.. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కఢ్ తనను మాట్లాడనివ్వలేదంటూ జయా బచ్చన్ విమర్శలు గుప్పించారు.
‘‘ఉదయం నుంచి మేము మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాము. మా పేషెన్సీ ఎంతుంటుందో చూస్తున్నామంటూ రాజ్యసభ లీడర్ అంటున్నారు. రాత్రి 11 గంటల వరకు రాజ్యసభ కార్యకలాపాలు కొనసాగాయి. అయితే ప్రతి ఐదు నిమిషాలకు వారు బ్రేక్ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో అలా వాష్రూంకు వెళ్దామంటూ అవి చాలా భయంకరంగా ఉన్నాయి’’ అని ఎస్పీ నేత జయా బచ్చన్ అన్నారు.
ఇక లోక్ సభలో మూడు క్రిమినల్ లా బిల్లులు ఆమోదం పొందడంపై ఆమె స్పందిస్తూ.. ‘‘బిల్లులు ప్రవేశ పెట్టారు. కానీ వాటిపై మాట్లాడడానికి విపక్షాలకు సమయం ఇవ్వలేదు. ప్రభుత్వం కూడా వాటిపై సరైన సమాధానం ఇవ్వలేదు. అసలు ఓటింగ్ కూడా గమ్మత్తుగా జరిగింది. సభలో విపక్ష నేతలు ఎవరూ లేరు. అప్పుడు కూడా బిల్లులపై ఓటింగ్ పెట్టారు. ఎందుకింత డ్రామా?’’ అంటూ ఆమె మండిపడ్డారు.