Jharkhand ruling coalition MLAs reach Ranchi airport over bjp operation kamala fear
Operation Kamala: కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రభుత్వాలు కూలిపోయి.. బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటు వెనుక ఉన్న ‘ఆపరేషన్ కమలం’ వ్యూహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తదుపరి రాష్ట్రం ఏదంటూ ఎదురుచూస్తోన్న తరుణంలో జార్ఖండ్ రాష్ట్రంలో సంక్షోభం మొదలైంది. కొద్ది రోజులుగా అవినీతి ఆరోపణల కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై బీజేపీ నానా హంగామా చేస్తోంది. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఆపరేషన్ కమలానికి బీజేపీ సిద్ధమైందని అధికార కూటమి (కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా) నేతల్లో భయం చుట్టుకుంది. ఈ తరుణంలోనే ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను రాష్ట్రాన్ని దాటిస్తున్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పక్కాగా అడుగులు వేస్తోందని, డేగ కన్నుతో ఎమ్మెల్యేలను పసిగడుతోందన్న భయాందోళనలో తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అధికార పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాంగ్రెస్, జెఎంఎం ఎమ్మెల్యేలు వరుస పెట్టి రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరందరినీ పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఆపరేషన్ కమలం భారి నుంచి తప్పించుకుని ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలు కాస్త ముందుగానే మేల్కొన్నాయని అంటున్నారు.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా భూపేష్ బాఘేల్ బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పాలిత అన్ని రాష్ట్రాలను ఒక కుదుకుదిపేసిన బీజేపీ.. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ను తాకనైనా లేదు. రాజస్తాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అయితేనే కాస్త సేఫ్ అని కాంగ్రెస్, జేఎంఎం అధిష్టానాలు భావించాయట. ఈ నేపథ్యంలో వారిని అక్కడికి తరలిస్తున్నట్లు సమాచారం.