Mother two Sons Murder : ఇద్దరు కొడుకులతో సహా తల్లిని గొడ్డళ్లతో నరికి చంపిన దుండగులు
- nagamani
- Published On : April 20, 2021 / 04:21 PM IST
Jharkhand Crime
woman two children murder : జార్ఖండ్లో గర్హ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. చిన్న పిల్లలని కూడా చూడకుండా తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను అత్యంత దారుణంగా నరికిపారేశారు దుండగులు. జాతా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను, ఆమె ఇద్దరు కొడుకులను అత్యంత దారుణంగా హత్యచేశారు. గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపేశారు.
ఈ ఘటన జరిగినప్పుడు ఇంట్లో మహిళతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 30 ఏళ్ళ మహిళ తన 8, 6 ఏళ్లున్న కొడుకులతో ఇంట్లో ఉంది. అదే సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు తల్లీతో పాటు ఇద్దరు పిల్లలను గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు.
ఘటన సమయంలో సదరు మహిళ భర్త.. నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటి పనులను చూసుకోవటానికి వెళ్లాడు. అతను సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి కొడుకులతో పాటు భార్య విగతజీవులుగా పడిఉండటం చూసి దిగ్ర్భాంతికి గురయ్యాడు. అనంతరం షాక్ నుంచి తేరుకున్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యలు చేయాల్సిన అవసరం ఎవరికుంది? వారికి ఎవరైనా శతృవులున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
