మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కష్టాలు పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పరిగణిస్తున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలకు ఇది ఇష్టం లేదు. అయితే తాజా ఓటమితో రాహుల్ అసలు ప్రధాని అభ్యర్థి కాదని చెప్పేందుకు మిత్ర పక్షాలకు గొంతు పెరిగింది. 2024 ఎన్నికలకు నమ్మకమైన నాయకుడు కావాలంటూ జేడీయూ పార్టీ ఇప్పటికే ప్రకటనలు చేయడం ప్రారంభించింది. ఈ తరుణంలో కేరళ ముఖ్యమంత్రి పిరయి విజయన్ నుంచి భారీ ప్రకటన వచ్చింది.
రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారా అనే ప్రశ్నను ఆయన సంధించారు. కారణం.. ఆయన కేరళ నుంచి ఎంపీగా ఉండడం. కేరళలో కాంగ్రెస్ ప్రత్యర్థి కమ్యూనిస్టులు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇక ఈ విషయమై సీఎం పినరయి విజయన్ స్పందిస్తూ.. ఆయన (రాహుల్) బీజేపీతో పోరాడుతున్నారో లేదో కానీ ఎల్డీఎఫ్తో మాత్రం పోరాడుతున్నారని అన్నారు. అంతే కాకుండా కేరళ నుంచి ఉత్తర భారతానికి రాహుల్ వెళ్లిపోవాలని ఆయన సూచించారు.
రాహుల్ నియోజకవర్గమైన వయనాడ్ లో తమ అభ్యర్థిని నిలబెడతామని విజయన్ అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే ఇండియా కూటమి లక్ష్యమని అన్న ఆయన.. పొత్తు అవసరం లేకుంటే కేరళలో కాంగ్రెస్, ఎల్డీఎఫ్ మధ్యే పోటీ ఉంటుందని, వాయనాడ్లో ఎల్డీఎఫ్ తన అభ్యర్థిని నిలబెడుతుందని స్పష్టం చేశారు. త్రిసూర్లో మంగళవారం మీడియాతో పినరయి మాట్లాడుతూ.. ‘‘కేరళలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలా లేక ఎల్డీఎఫ్పైనా పోరాడాలా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి. మీరు ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారని కేరళలో చెప్పగలరా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.