EVM Fire: బెంగాల్ అలీపుర్ ప్రభుత్వ భవనంలో అగ్ని ప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం
ఈ ఘటనలో సుమారు 4,000 ఈవీఎం(EVM Fire)లు పూర్తిగా కాలిపోయినట్లు రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌధురీ వెల్లడించారు.
- V Santhosh Kumar
- Published on- June 11, 2026 / 08:57 PM IST
Kolkata alipore government building massive fire 4000 evms destroyed
- కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది
- నాలుగు వేల ఈవీఎంలు కాలిపోయాయి అని
- దర్యాప్తులో కుట్ర కోణం పరిశీలన జరుగుతోంది
EVM Fire: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని అలీపుర్ ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం రాష్ట్ర యంత్రాంగాన్ని కుదిపేసింది. తొమ్మిది అంతస్తుల ప్రభుత్వ భవనంలో బుధవారం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ భవనంలో పలు ప్రభుత్వ శాఖల కార్యాలయాలతో పాటు అలీపూర్ పరిధిలోని దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయం కూడా ఉంది. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 24 గంటలకు పైగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో సుమారు 4,000 ఈవీఎం(EVM Fire)లు పూర్తిగా కాలిపోయినట్లు రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌధురీ వెల్లడించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఈవీఎంలను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 10 నియోజకవర్గాల్లో ఉపయోగించినట్లు తెలుస్తోంది. భవనంలో రెండో, మూడో అంతస్తుల్లో తొలుత మంటలు కనిపించాయని అధికారులు తెలిపారు. అయితే మధ్య అంతస్తులు పెద్దగా ప్రభావితంకాకుండా పై అంతస్తులకు మంటలు ఎలా వ్యాపించాయనే విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో, ఇది సాధారణ అగ్ని ప్రమాదమా లేక ఏదైనా ఉద్దేశపూర్వక చర్యా అన్న కోణంలో కూడా అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టారు. సౌత్ 24 పర్గణాస్ జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయి. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ కుట్ర కోణాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని పేర్కొన్నారు. అయితే దర్యాప్తు అధికారులు మాత్రం శాస్త్రీయ పరీక్షలు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగానే తుది నిర్ధారణకు వస్తామని స్పష్టం చేశారు. భవనంలో దెబ్బతిన్న రికార్డులు, మౌలిక సదుపాయాల నష్టంపై కూడా అంచనాలు కొనసాగుతున్నాయి.
