Lightning Strikes Deaths : పిడుగుల బీభత్సం.. 24 గంటల్లో 77 మంది ప్రాణాలు గాల్లోకి..!
దేశంలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో 77 మంది పిడుగుపాటుకు బలికాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఎక్కువగా పిడుగులు బీభత్సం సృష్టించాయి.
- Sreehari A
- Published On : July 13, 2021 / 08:16 AM IST
Lightning Strikes Kill At Least 77 People With In 24 Hours Across States (1)
Lightning Strikes Deaths : దేశంలో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. గడిచిన 24 గంటల్లో 77 మంది పిడుగుపాటుకు బలికాగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఎక్కువగా పిడుగులు బీభత్సం సృష్టించాయి. అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగుల దెబ్బకు 42 మంది మృతిచెందారు. అలాగే రాజస్థాన్ లో 23 మంది మృతిచెందగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 12 మంది పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు.
వరుస పిడుగుపాటు ఉత్పాతంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. యూపీలోని ఒక్క ప్రయాగ్రా జోన్లోనే పిడుగుల దెబ్బకు వేర్వేరు ప్రాంతాల్లో 14 మంది మృతిచెందారు. కాన్పుర్ దెహత్, ఫతేపుర్లలో ఐదుగురు బలయ్యారు. కౌశాంబిలో నలుగురు, ఫిరోజాబాద్ నగరంలో ముగ్గురు పిడుగుపాటుకు చనిపోయారు.
రాజస్థాన్ లోనూ వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగు ధాటికి 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు తెలిసింది. ఇక జైపుర్ లోని అంబర్ కోట సమీపంలోని వాచ్ టవర్ వద్ద పిడుగు పడింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా పిడుగు దెబ్బకు 12 మంది మృతిచెందగా.. 11 మంది గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మైనర్లు ఉన్నారు.
