Mamata Banerjee: ఢిల్లీకి దీదీ.. సోనియాతో సహా పెద్దలతో మంతనాలు!
ఢిల్లీలో రాజకీయం చాలా వేగంగా కదులుతుంది. రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం రాజధానిలో అనుహ్యంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉండగానే ఇప్పుడే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా అనేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.
- Naresh Mannam
- Published On : July 15, 2021 / 06:27 PM IST
Mamata Banerjee
Mamata Banerjee: ఢిల్లీలో రాజకీయం చాలా వేగంగా కదులుతుంది. రాజకీయ విశ్లేషకులు ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం రాజధానిలో అనుహ్యంగా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉండగానే ఇప్పుడే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా అనేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ముందుగా వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎంపిక ఉండగా అప్పటికే దేశ రాజకీయాలలో మార్పు కనిపించేలా జాతీయ రాజకీయాలలో కదలిక స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ త్వరలో తాను ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఎన్సీపీ నేత శరద్ పవార్ ను, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలుసుకుంటానని దీదీ ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల తరువాత కోవిడ్ కారణంగానే ఇప్పటివరకూ తాను ఢిల్లీకి వెళ్లలేదని చెప్పిన మమతా.. రాష్ట్రంలో కోవిడ్ సమస్య కొంత తగ్గడంతో దేశ రాజధానికి వెళ్లాలనుకుంటున్నానని ఆమె చెప్పారు. పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న తరుణంలో మమతా జాతీయస్థాయిలో నేతలతో సమావేశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తం నాలుగు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు ప్రణాళిక వేసుకుంటున్నట్లు చెప్పిన దీదీ ఇప్పటివరకు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళేది ఖరారు చేయలేదని చెప్పారు. కాగా, ఇప్పటికే ఢిల్లీలో వాడీవేడీ రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణతో మొదలైన రాజకీయ సందడిని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారు. ముందుగా శరద్ పవార్ తో రెండుసార్లు భేటీ అయిన ప్రశాంత్ ఆ తర్వాత సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం కావడం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. ఇక ఇప్పుడు మమతా కూడా ఢిల్లీ ప్రయాణంతో ఢిల్లీ రాజకీయం దేశప్రజలలో మరింతగా చర్చకు దారితీస్తుంది.
