Uttar Pradesh: ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ సహా అతడి అనుచరుడు గులాంలను గురువారం ఎన్కౌంటర్ చేయడంపై ఒకవైపు ప్రశంసలు వస్తుండగా, మరొకవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ సుప్రెమో మాయావతి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ వివర్శనాత్మకంగా స్పందించారు. దీనిపై అనుమానాలున్నాయని, విచారణ జరగాలని మాయావతి డిమాండ్ చేయగా, ఇది తప్పుడు ఎన్కౌంటర్ అని అఖిలేష్ విమర్శించారు. పరోక్షంగా యోగి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్కౌంటర్ అనంతరం మాయావతి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘ఈరోజు పోలీసు ఎన్కౌంటర్లో ప్రయాగ్రాజ్ అతిక్ అహ్మద్ కొడుకు సహా మరొకరి హత్యపై అనేక రకాల చర్చలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. వికాస్ దూబే ఘటన పునరావృతమవుతుందన్న తమ ఆందోళన నిజమైందని ప్రజలు భావిస్తున్నారు. కావున, ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలతో నిజాలు ప్రజల ముందుకు రావాలంటే ఉన్నత స్థాయి విచారణ అవసరం’’ అని మాయావతి అన్నారు.
ఇక దీనిపై అఖిలేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘తప్పుడు ఎన్కౌంటర్లు చేస్తూ అసలు సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీకి కోర్టుపై అస్సలు నమ్మకం లేదు. ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లను కూడా క్షుణ్ణంగా విచారించి దోషులను వదిలిపెట్టకూడదు. ఏది ఒప్పో ఏది తప్పో నిర్ణయించే హక్కు శక్తి పార్టీలకు లేదు’’ అని అన్నారు. చివరలో ‘బీజేపీ సోదారాభావానికి వ్యతిరేకం’ అని రాసుకొచ్చారు.
అసద్ అహ్మద్ సహా అతడి అనుచరుడు గులాంను ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం ఝాన్సీ జిల్లాలో ఎన్కౌంటర్లో హతమార్చారు. హతమైన ఇద్దరు గ్యాంగ్స్టర్లని పోలీసులు చాలా రోజుల క్రితమే రికార్డు చేశారు. అంతే కాకుండా వారిపై ఐదు లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. ఉమేశ్ పాల్ హత్య జరిగినప్పుడు సంగటన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలకు అసద్, గులాం చిక్కారు. దీని ఆధారంగానే వారిపై తాజా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Thota Chandrasekhar : ఏపీలో ఇది బీఆర్ఎస్ తొలి విజయం-తోట చంద్రశేఖర్
ఈరోజు మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందంపై గులాం విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని, పోలీసులు ప్రతీకార చర్యకు దిగడంతో ఇద్దరు మరణించారని ఒక పోలీసు అధికారి తెలిపారు. వారి నుంచి అధునాతన ఆయుధాలు, సెల్ఫోన్లు, సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమేష్ పాల్ హత్య తర్వాత అసద్ అహ్మద్ లక్నోకు పారిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అతను ఢిల్లీ చేరుకోవడానికి ముందు కాన్పూర్.. అటు నుంచి మీరట్కు వెళ్లినట్లు తెలిసింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్కు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఝాన్సీకి చేరుకుని బైక్పై రాష్ట్ర సరిహద్దుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అసద్ మారువేషంలో ఉన్నట్లు సమాచారం. అతిక్ అహ్మద్ గ్యాంగ్లో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడని, అతను అసద్ ఆచూకీ గురించి చెప్పాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
CM MK Stalin : బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
ఇక ఈ ఇద్దరిని హతమార్చడంపై ఉమేశ్ పాల్ తల్లి శాంతి దేవి హర్షం వ్యక్తం చేశారు. తన కొడుకు ఇది నివాళి అని అన్నారు. అంతే కాకుండా తమకు న్యాయం అందించారంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని నేరస్తులకు ఇదొక హెచ్చరిక అని, ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు. అయితే తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడానికి కారణం మీడియానేనని అతిక్ అహ్మద్ అన్నారు.