PM Modi: ప్రతి నెల చివరి ఆదివారం రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల వారం ముందుగానే జరిగింది. ఈ నెల 21 నుంచి అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. అటు నుంచి ఈజిప్టు పర్యటనకు వెళ్లబోతున్నారు. దీంతో ఈ నెల చివరి ఆదివారమైన 25న ఆయన ఇండియాలో ఉండరు. అందుకే మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వారం ముందుగానే నిర్వహించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇక ఈరోజు (18 జూన్) నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశంలోని పలు అంశాల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అలాగే బిపర్జోయ్ తుపాను గుజరాత్లోని కచ్లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.
Narendra Modi: మోదీకి ప్రైవేట్ డిన్నర్ కూడా ఇవ్వనున్న జో బైడెన్!
వసుధైక కుటుంబం కోసం యోగా అనేది ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాల ఇతివృత్తమని మోదీ అన్నారు. వాస్తవానికి ఈ యేడాది యోగాడేను ఆయన ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో జరుపుకోనున్నారు. అక్కడి నుంచే యోగా డే సందేశాన్ని ప్రపంచానికి మోదీ ఇవ్వనున్నారు. దీనికి ముందు యోగా డే గురించి ఆదివారం మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఒక ప్రపంచం-ఒకే కుటుంబంగా అందరి సంక్షేమం కోసం యోగా అని తెలిపారు. యోగా స్ఫూర్తిని ఇది వ్యక్తం చేస్తుందన్నారు. ఇది అందరినీ అనుసంధానం చేసి, అందరూ తనను అనుసరించేలా చేస్తుందని మోదీ అన్నారు.