డోక్లాం ద‌గ్గ‌ర‌లోనే చైనా ఆయుధ బంకర్లు

New Chinese Ammunition Bunkers స‌రిహ‌ద్దులో చైనా ఆగ‌డాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఓవైపు శాంతి చ‌ర్చ‌ల పేరుతో దృష్టి మ‌ర‌ల్చి.. మ‌రోవైపు సైలెంట్‌గా త‌న పని తాను చేసుకుపోతోంది. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీట‌ర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంక‌ర్లు నిర్మించిన‌ట్లు తేలింది. 2017లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభనకు కారణమైన డోక్లాం నుంచి ఈ ప్రాంతం కేవలం ఏడు కిలోమీట‌ర్ల దూరంలోనే ఉంది.



నిజానికి గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు లేన‌ట్లు అప్ప‌టి శాటిలైట్ ఫొటోలు స్ప‌ష్టం చేస్తున్నాయి. అయితే అక్టోబ‌ర్ 28న తీసిన ఫొటోల్లో మాత్రం నిర్మాణాలు పూర్త‌యిన‌ట్లు క‌నిపించింది. అంటే ఏడాదిలోపే ఈ బంక‌ర్ల నిర్మాణాన్ని చైనా పూర్తి చేసింది.



డోక్లాం ప్రాంతంలో మ‌రోసారి వివాదం త‌లెత్తితే చైనా బ‌ల‌గాలు స‌మ‌ర్థంగా పోరాడేలా ఈ బంక‌ర్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ లెక్క‌న ఈ ప్రాంతంలో త‌మ బ‌ల‌గాల‌ను పెంచే ఆలోచ‌న‌లో చైనా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. అదే జ‌రిగితే మ‌రోసారి డోక్లాంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొనే ప్ర‌మాదం ఉంది.



మరోవైపు,ఇటీవల భూటాన్ భూభాగంలోకి రెండు కిలోమీట‌ర్ల మేర చొచ్చుకొని వెళ్లిన చైనా ఏకంగా గ్రామాన్నే నిర్మించినట్లు తేల‌గా.. ఆ త‌ర్వాత 9 కిలోమీట‌ర్ల మేర రోడ్డునూ నిర్మించిన‌ట్లు శాటిలైట్ ఫొటోలు తేల్చిన విషయం తెలిసిందే. తాజాగా సించె-లా పాస్‌కు 2.5 కిలోమీట‌ర్ల దూరంలో చైనా ఏకంగా ఆయుధ బంక‌ర్లు నిర్మించిన‌ట్లు తేలింది.