ప్రశ్నించిన వెంటనే బ్యాన్ చేశారు : కరెంట్ కోతలపై సాక్షి ఆగ్రహం

జార్ఖండ్‌ రాజధాని రాంచీలో కరెంట్ కోతలపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోని సతీమణి సాక్షి సింగ్‌ ఫైర్ అయ్యారు. కరెంట్‌ కోతలపై ట్విట్టర్‌ వేదికగా సాక్షి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

ప్రతి రోజు కరెంట్‌ కోతలతో రాంచీ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాదాపు రోజూ 4 నుంచి 7 గంటలు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ రోజు కరెంట్‌ లేక ఐదు గంటలవుతుంది. ఈ రోజు విద్యుత్‌ సరఫరాను ఎందుకు నిలిపివేశారో అర్థం కావడం లేదు. ఈ రోజు పండగ కాదు.. వాతావరణం కూడా బాగానే ఉంది. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాఅంటూ ఆమె ట్వీట్‌ చేశారు.

ఇక సాక్షి ట్వీట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయే విధంగా సాక్షి ట్వీట్‌కు సీఎం, ఇతర ఉన్నతాధికారుల పేర్లను జతచేస్తూ పలువురు నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. మరోవైపు ధోని ప్రకటన ఇస్తున్న ఇన్వెర్టర్‌ను వాడాలని మరికొందరు సరదా సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ సమస్య ఒక్క రాంచీలో మాత్రమే లేదని మొత్తం జార్ఖండ్ అంతటా ఈ సమస్య ఉందని మరికొందరు ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు ఆమె ట్వీట్ ను సున్నితమైన అంశం అంటూ ట్విట్టర్ తొలగించింది.