రేప్..మోసం..దగా చేయలేదు..ఎవరి డబ్బులు కూడా లూఠీ చేయలేదు..ఎలాంటి టెన్షన్ లేదు..ఈడీ అధికారులకు సహకరిస్తా..విచారణకు హాజరవుతా అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్. ఈడీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆయన స్పందించారు. ఈడీ అధికారుల తీరుపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష అన్నారు. కేవలం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు తాను ప్రయత్నాలు చేసినట్లు..ఇది ఒర్వలేక వేధింపులు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని వేసిన పిటిషన్ను కర్నాటక హైకోర్టును కొట్టివేసిందన్నారు.
2019, ఆగస్టు 29వ తేదీ గురువారం రాత్రి 9 గంటలకు ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారని..తనను విచారణ చేయడానికి ఈడీ ఆసక్తి చూపిస్తోందని..కనీసం న్యాయవాదులతో మాట్లాడుకొనే అవకాశం ఇవ్వలేదన్నారు. అయినా..కూడా..ఈడీ అధికారుల విచారణకు సహకరిస్తానని..తనకు చట్టం..న్యాయంపై నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు శివకుమార్.
కర్నాటకలో ట్రబుల్ షూటర్గా ఈయనకు పేరుంది. పార్టీ సమస్యల్లో ఉన్నప్పుడు చాకచక్యంగా పరిష్కరించే వారు. ఇటీవలే జేడీఎస్ – కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కృషి చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు హోటల్ వద్దకు చేరుకున్న ఈయనకు పోలీసులు పరిష్మన్ ఇవ్వలేదు. దీంతో ఆయన వర్షంలోనే తడుస్తూ ఉండిపోయారు. కానీ బలపరీక్షలో సీఎం కుమార స్వామి ఓడిపోయారు. సీఎంగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు.
రూ. కోట్లలో పన్ను ఎగవేతలకు పాల్పడడంతో పాటు..అక్రమ లావాదేవీలు సాగించారనే ఆరోపణలపై డీకే శివకుమార్తో పాటు మరికొందరిపై గత ఏడాది సెప్టెంబర్లో ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో డీకేతో పాటు ఢిల్లీలోని కర్నాటక భవన్కు చెందిన ఉద్యోగి సహా మరికొందరి పేర్లను ఈడీ చేర్చింది. గత రెండేళ్లుగా తన 84 ఏళ్ల తల్లికి చెందిన యావదాస్తినీ బినామా ఆస్తులుగా దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయని..తమ రక్తం మొత్తం పీల్చేశారని డీకే శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.