Odisha Vigilance Department : పాడైపోయిన ఇంట్లో ఏకంగా రూ. 3.41 కోట్ల నగదు, బంగారం బయటపడడం సంచలనం రేకేత్తిస్తోంది. ఇదంతా అవినీతి సొమ్మేనని తెలుస్తోంది. అధ్వానస్థితిలో ఉన్న ఇంట్లో పెడితే.. ఎవరికీ అనుమానం రాదని అనుకున్నాడో ఏమో.. కానీ విజిలెన్స్ అధికారుల జరిపిన దాడుల్లో ఈ సొమ్ము బయటపడింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. గంజాం భంజనగర్ మైనర్ ఇరిగేషన్ విభాగంలో సహాయ ఇంజినీర్ (AE)గా కార్తికేశ్వర రవుళొ పని చేస్తున్నాడు. ఇతను భారీగా అక్రమాలకు పాల్పడ్డాడని, అక్రమార్జన ఆరోపణలు వినిపించాయి. దీంతో విజిలెన్స్ అధికారులు అతను ఉంటున్న నివాసానికి చేరుకుని దాడులు నిర్వహించారు. గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు.
Read More : Sharad Pawar: శరద్ పవార్ ఇంటిపై దాడి ఘటనలో లాయర్ సహా 110 మంది అరెస్ట్
విచారణలో అతనికి రెండో భార్య కల్పన ఉన్నట్లు తేలింది. ఆమెను విచారించారు. మొదటి భార్యకు తెలియకుండా కల్పనను వివాహం చేసుకున్నాడని నిర్ధారించారు. సోదరి సలియాసాహి బస్తీలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో ఆమె అక్కడ ఎందుకు నివాసం ఉంటుందని అధికారులు అనుమానించారు. అనంతరం ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా రూ. 3.41 కోట్ల నగదు, 940 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. నగదును లెక్కించడానికి మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది. వెంటనే స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ. 7 కోట్ల విలువైన నగదు, ఆస్తి వెలుగులోకి వచ్చిందని ఒడిశా విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. కల్పనను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.