Bihar Caste Survey: బిహార్ కులగణనపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కలకలం.. కులగణనపై నితీశ్ మోసం చేశారట
బీహార్ కుల గణనకు సంబంధించి 36 శాతం అత్యంత వెనుకబడిన వారి సంఖ్య వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. ఈ 36 శాతం మందికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేదా మరెవరు అధికారంలో ఉన్నా వెనుకబడిన తరగతులను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారని మండపడ్డారు
- tony bekkal
- Published On : October 2, 2023 / 09:14 PM IST
Bihar Caste Survey: బీహార్లో జరుగుతున్న కుల గణనపై ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. పొరుగు రాష్ట్ర జ్వాలలు తగలడం మామూలే కానీ, కులగణన అనంతరం నితీశ్ ను మెచ్చుకోలేని పరిస్థితిలో విపక్షాలు సంకటంలో ఉంటే.. నితీశ్ కుమార్ మోసం చేశారంటూ సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత, మాజీ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. బీహార్ కుల గణనకు సంబంధించి 36 శాతం అత్యంత వెనుకబడిన వారి సంఖ్య వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. ఈ 36 శాతం మందికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేదా మరెవరు అధికారంలో ఉన్నా వెనుకబడిన తరగతులను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారని మండపడ్డారు. పేరు కూడా తెలియని కులాలు ఉన్నాయని, వారికి ఎవరూ ఏం చేయలేదని ఓం ప్రకాష్ మండిపడ్డారు.
‘‘రాజకీయాలలో అంటరానితనంగా మిగిలిపోయిన కులాలకు ఇతర కులాల్లో చోటు కల్పించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే లాలూ, సీఎం నితీశ్ ఎప్పుడైనా షెడ్యూల్డ్ కులాలను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారా? రాజ్వార్, రాజ్వాన్సీ, రాజ్భర్, రాజ్దోహ్ వంటి మన సంఘాల జనాభా 29 జిల్లాల్లో ఉంది. కుల గణాంకాలలో ఆ కులాలు కనిపించకపోతే, రాజకీయాలలో తక్కువ భాగస్వామ్యం ఉన్న కులాలను ఇతర కులాలలో లెక్కిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది’’ అని ఆయన అన్నారు.
కాగా, అందరి ఇళ్లకు వెళ్లి జనాభా గణన చేయలేదని ఓం ప్రకాష్ రాజ్భర్ విమర్శించడం గమనార్హం. ప్రభుత్వం ప్రకారం ఇది సరైనదే కావచ్చు కానీ తాను సరైనదని అంగీకరించలేనని అన్నారు. మరోవైపు, బీహార్ కులాల సర్వేపై ఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ, కులాల వారీగా జనాభా గణనను సకాలంలో పూర్తి చేసినందుకు బీహార్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. విధానం, ఉద్దేశాలు స్పష్టంగా ఉంటే ప్రతి పని సాధ్యమవుతుందని అన్నారు. ఇక ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. భవిష్యత్ రాజకీయాల దిశను పీడీయే నిర్ణయిస్తుందని అన్నారు.
