సెప్టెంబర్ 2 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే, కరోనా నేపథ్యంలో దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభ్యులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
15మంది పార్లమెంటు సెక్రటేరియేట్ అధికారులకు మాత్రమే సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఉంటుంది. రాజ్యసభ సమావేశాలకు ఏడుగురు, లోక్సభకు 15మంది రిపోర్టర్లను మాత్రమే అనుమతిస్తారు. మొదట లోక్సభ, ఆ తర్వాత రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. ఒక్కో సభ(లోక్సభ, రాజ్యసభ) నాలుగు గంటలే సమావేశమవుతుంది. ప్రధాన చాంబర్లనుంచి అధికారులను దూరంగా ఉంచేందుకు మధ్యలో పాలీకార్బొనేట్ షీట్లు ఏర్పాటుచేస్తారు.
లోక్సభ, రాజ్యసభ ప్రధాన సభావేదికలతోపాటు గ్యాలరీల్లోనూ సభ్యులకు సీట్లు ఏర్పాటుచేయనున్నారు. రాజ్యసభ సభ్యులను పార్టీల బలాలను బట్టి రాజ్యసభ ప్రధాన సమావేశ మందిరంతోపాటు గ్యాలరీల్లో సీట్లు కేటాయిస్తారు. సరిపోకపోతే లోక్సభ చాంబర్లో సీట్లు వేస్తారు. ప్రధాని, మంత్రులు, సభా నాయకులు, ప్రతిపక్ష సభ్యులకు రాజ్యసభలో ప్రధాన మందిరంలో సీట్లు కేటాయిస్తారు.
రాజ్యసభ, లోక్సభ సభా మందిరాల్లో 82 ఇంచుల వెడల్పయిన రెండు భారీ డిజిటల్ తెరలను ఏర్పాటుచేస్తున్నారు. నాలుగు గ్యాలరీల్లో 40 ఇంచుల తెరలను పెడుతున్నారు. వేర్వేరు చోట్ల కూర్చునే సభ్యులు చర్చలను ఈ తెరలపైనే వీక్షిస్తారు. చర్చలు కూడా ఈ తెరల ద్వారానే జరుగుతాయి. చర్చల సమయంలో ఆడియో గ్యాప్ రాకుండా ప్రత్యేక సాంకేతిక ఏర్పాట్లు చేస్తున్నారు.
.