Pet Dog Dies During Owner Funeral : యజమాని అంతిమయాత్రలోనే ప్రాణాలు విడిచిన పెంపుడు కుక్క.. హృదయాలను కదిలిస్తున్న ఘటన
Pet Dog Dies During Owner Funeral : తన యజమాని మరణాన్ని తట్టుకోలేక ఓ పెంపుడు కుక్క ఆయన అంతిమయాత్రలోనే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకోగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
- Harish Thanniru
- Published on- July 15, 2026 / 02:24 PM IST
Pet Dog Dies During Owner Funeral
Pet Dog Dies During Owner Funeral : మనుషులు, పెంపుడు జంతువుల మధ్య ఉండే బంధానికి ఇది మరో హృదయ విదారక ఉదాహరణ. మధ్యప్రదేశ్లో తన యజమాని మరణాన్ని తట్టుకోలేక ఓ పెంపుడు కుక్క అంతిమయాత్రలోనే ప్రాణాలు విడిచింది. యజమాని పాడె వెంటే కొద్దిదూరం నడిచిన ‘డుగ్గు’ ఒక్కసారిగా కుప్పకూలి మరణించడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పెంపుడు జంతువులు తమ యజమానులపై ఎంతటి ప్రేమ, విశ్వాసం చూపిస్తాయో మరోసారి నిరూపించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. తన యజమాని మరణాన్ని తట్టుకోలేక ఓ పెంపుడు కుక్క ఆయన అంతిమయాత్రలోనే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకోగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.
బేతుల్ జిల్లాకు చెందిన ప్రదీప్ జైన్ (67) అనారోగ్యంతో భోపాల్ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే కుటుంబ సభ్యులు పెంచుకుంటున్న ‘డుగ్గు’ అనే పెంపుడు కుక్క తీవ్ర ఆందోళనకు గురైంది. యజమాని విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి డుగ్గు తట్టుకోలేకపోయింది. ఇంట్లో బంధువులు ఎక్కువగా ఉండటంతో దానిని మరో గదిలో ఉంచినా, రాత్రంతా తలుపులు బాదుతూ మొరుగుతూనే ఉంది.
మరుసటిరోజు ఉదయం అంతిమయాత్ర ప్రారంభానికి కొద్దిసేపటి ముందు కుటుంబ సభ్యులు డుగ్గును ప్రదీప్ జైన్ మృతదేహం వద్దకు తీసుకొచ్చారు. యజమానిని చివరిసారి చూసిన తర్వాత అది నిశ్శబ్దంగా లోపలికి వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత అంతిమయాత్ర ప్రారంభమై పాడెను తీసుకెళ్తుండగా డుగ్గు ఒక్కసారిగా పరుగెత్తుకుంటూ బయటకు వచ్చింది. యజమాని పాడె వెంటే కొద్దిదూరం నడిచిన అనంతరం అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
యజమాని మరణాన్ని తట్టుకోలేకే డుగ్గు చనిపోయిందని కుటుంబ సభ్యులు భావోద్వేగంతో తెలిపారు. పెంపుడు కుక్క చూపిన అపారమైన విశ్వాసానికి గౌరవంగా ప్రదీప్ జైన్ను ఖననం చేసిన అదే స్మశానవాటికలో, ఆయన సమాధి పక్కనే డుగ్గును కూడా పూర్తి గౌరవంతో ఖననం చేశారు.
యజమాని, పెంపుడు శునకం మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అంత్యక్రియలకు హాజరైనవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారి, జంతువుల విశ్వాసంపై నెటిజన్లు భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు.
