PM Modi-J&K Leaders Meeting ప్రధాని మోదీతో జమ్మూకశ్మీర్కు చెందిన నేతలు ఇవాళ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరుగుతోంది.జమ్మూకశ్మీర్లో రాజకీయ సుస్థిరతను తీసుకురావాలన్న ఉద్దేశంతో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్కు చెందిన 14 మంది నేతలు మోదీతో భేటీలో పాల్గొన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్లోన్, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, యూసుఫ్ తరిగామి సహా తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు కీలక నేతలు కూడా హాజరయ్యారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం వంటివి గుప్కార్ కూటమి ఈ సమావేశంలో ప్రధానంగా డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేకించి నియంత్రణ రేఖ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.