Heeraben Modi: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు.
- Harishth Thanniru
- Published On : December 28, 2022 / 02:14 PM IST
PM Modi mother Heeraben
Heeraben Modi: ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే ఆమె వందో సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఆమె 100వ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గాంధీనగర్లోని తన తమ్ముడు పంకజ్ మోదీ నివాసానికి వెళ్లి తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో అరగంట పాటు ముచ్చటించారు. ఇటీవల గుజరాత్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ మోదీ తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
హీరాబెన్ మోదీ 1923 జూన్ 18న జన్మించారు. తల్లి హీరాబెన్కు అనారోగ్యం దృష్ట్యా ప్రధాని అహ్మదాబాద్ వెళ్లే అవకాశం ఉంది. అప్రమత్తమైన గుజరాత్ పోలీసులు నగర వ్యాప్తంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ తల్లి అనారోగ్యవార్త తెలుసుకున్న తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు యూఎన్ మెహతా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీస్తున్నారు.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆస్పత్రికి వద్దకు వెళ్లారు. హీరాబెన్ ఆరోగ్య పరిస్థితిపై స్థానిక వైద్యులను ఆరాతీశారు. అహ్మదాబాద్ ఎమ్మెల్యే దర్శనాబెన్ వాఘేలా, దర్యాపూర్ ఎమ్మెల్యే కౌశిక్ జైన్ లు ఆస్పత్రి వద్దకు చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. ఆస్పత్రి వైద్యులు హీరాబెన్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆస్పత్రి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
