Uttar Pradesh Politics: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన అనంతరం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను మరింత లక్ష్యం చేసుకున్నారు సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్భర్. తాజాగా ఆయన మాట్లాడుతూ యూపీలో అసలు యాదవులు ముఖ్యమంత్రే అవ్వరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘోసీ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఓం ప్రకాష్ రాజ్భర్ను అఖిలేష్ యాదవ్ సీఎం కావడంపై పాత్రికేయులు ప్రశ్నించగా.. ‘‘అఖిలేష్ యాదవ్ సీఎం ఎలా అవుతాడు.. ఎవరికి ఓటేస్తారు?’’ అని విలేకరులను ఓం ప్రకాష్ రాజ్భర్ తిరుగు ప్రశ్నించారు.
‘‘ఇప్పుడు పటేల్, మౌర్య, చౌహాన్, నిషాద్, బింద్, రాజ్భర్ లాంటి వారు సీఎం కావాలని బలంగా కోరుకుంటున్నారు. వారిని అందుకు సిద్ధం చేస్తే ప్రభుత్వంలోకి రావచ్చు. లేదు మేమే (యాదవులు) ఉంటామంటే ప్రభుత్వంలోకి రాలేరు’’ అని రాజ్భర్ అన్నారు. ఇదిలా ఉండగా ఓం ప్రకాష్ రాజ్భర్ని ఓ విలేకరి ‘‘మిమ్మల్ని (రాజ్భర్ ) ముఖ్యమంత్రి చేస్తామంటే మీరు ఆయనతో (అఖిలేష్) వెళతారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘అలాంటి సమస్యే లేదు’’ అని నిర్మొహమాటంగా కొట్టి పారేశారు.
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ మీద ఓం ప్రకాష్ రాజ్భర్ తరుచూ విమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ఇంతకు ముందు అఖిలేష్ పీడీఏ ఫార్ములాపై విరుచుకుపడ్డారు. పీడీఏ గురించి మాట్లాడుతూ.. ప్రచార సమయంలో అఖిలేష్ చాలా సందడి చేస్తారని, అయితే టిక్కెట్ పంపిణీ సమయంలో మర్చిపోతారని రాజ్భర్ అన్నారు. ‘‘ఇప్పుడు పీడీఏ కి ‘ఎస్’ని జోడించి, దానిని ‘పీడీఏఎస్’గా చేయాలి. అంటే వెనుకబడిన, దళిత, మైనారిటీ, సాధారణ వర్గం. అఖిలేష్ పీడీఏ ఇప్పుడు ఎన్డీయేలో విలీనమైంది. పీడీఏకు ఎన్డీయే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్పీకి ఏమీ రాదు. కౌంటింగ్లో ఆయనకు కొన్ని ఓట్లు మాత్రమే వస్తాయి’’ అని అన్నారు.