Ram Janmabhoomi Trust శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్దాస్(83) ఆరోగ్యం ఆదివారం మళ్లీ క్షీణించింది. ఛాతీలో నొప్పి, ఆక్సిజన్ లెవెల్స్లో హెచ్చుతగ్గులు, అతిగా మూత్రం విడుదల వంటి సమస్యలతో బాధపడుతున్న మహంత్ నృత్య గోపాల్దాస్ ను ఆదివారం ఉదయం అయోధ్యలో పరీక్షించిన వైద్యుల బృందం లక్నో హాస్పిటల్ కి తరలించాలని సూచించారు.
డాక్టర్ల సూచన మేరకు ఆయనను లక్నోలోని మేదాంత హాస్పిటల్ కు తరలించారు. నృత్య గోపాల్దాస్ మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు. దాంతో మూత్రం సరిగా ఉత్పత్తి కావడం లేదని చెప్పారు.
కాగా,మహంత్ నృత్య గోపాల్దాస్ ఆరోగ్యం క్షీణించడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్ లో కూడా మేదాంత హాస్పిటల్ లో గోపాల్దాస్ కు ఆపరేషన్ జరిగింది. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు.
2019లో సుప్రీంకోర్టు అయోధ్య మందిరం తీర్పు వెలువరించిన తర్వాత శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడుగా నియమితులైన మహంత్ నృత్య గోపాల్దాస్ గత ఏడాది సెప్టెంబర్లో కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కొవిడ్ బారిన పడిన గోపాల్దాస్ హాస్పిటల్ లో చేరి కొద్ది రోజులకే కోలుకున్నారు. ఆ తర్వాత ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు.