సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతూనే ఉంది. దేశ రక్షణ విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకోలేదంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయగా.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. యూపీఏ హయాంలో 6సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేశామంటూ వెల్లడించారు.
అయితే యూపీఏ హయాంలో ఒక్కసారి కూడా సర్జికల్ దాడులు జరగలేదంటూ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్టీఐ ద్వారా వెల్లడించింది. జమ్ముకశ్మీర్కు చెందిన రోహిత్ ఛౌదరీ అనే వ్యక్తి 2004 నుంచి 2014 మధ్యలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ ఆర్టీఐని ఆశ్రయించగా ఆర్టీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
2004 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ హయాంలో ఒక్క సారి కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. 2016, సెప్టెంబర్లో యూరి సెక్టార్లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించిన రికార్డులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.