సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. సమాచార వ్యవస్థలు లేని మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులకు శాటిలైట్ ఫోన్లు అందజేయనున్నారు. దీంతో వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే అవకాశం కలుగనుంది. శాటిలైట్ కమ్యూనికేషన్(వీ శాట్) ఆధారంగా సైనికులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్20, 2019) తెలిపింది.
సైనికులు నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తుంటారు. ఒక్కోసారి వారు ఫోన్ సౌకర్యం కూడా లేని మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఆ సమయంలో కనీసం పిల్లలతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం సైనికులకు శాటిలైట్ ఫోన్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది.
రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించిన 1409 మారుమూల ప్రాంతాల్లో వీశాట్ వినియోగానికి డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్(డీసీసీ) అంగీకారం తెలిపిందని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా సైనికులు చాలా తక్కువ ఖర్చుతో తమ కుటుంబీకులతో మాట్లాడుకోవచ్చన్నారు. మారుమూల ప్రాంతాల్లోని విధులు నిర్వర్తిస్తున్న మిలిటరీ, పారామిలిటరీ సిబ్బందికి రోజుకు ఒక జీబీ డేటాను ఉచితంగా అందిస్తామని, దానితో వారు తమ కుటుంబ సభ్యులతో సంభాషించుకోవచ్చని చెప్పారు.