Sharad Yadav: నిఖార్సైన సోషలిస్ట్ నాయకుడు శరద్ యాదవ్
రాజకీయ ప్రయోజనాల కోసం పోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి శరద్ యాదవ్ అనేది తరుచుగా వినిపించే మాట. రాజీవ్ గాంధీ నుంచి లాలూ వరకు చాలా మంది నేతలపై పోటీకి దిగారు. జనతాదళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ, తన పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి కుర్చీవైపు కన్నేత్తి చూడని నేత. లాలూ, నితీశ్ వంటి నేతలు ముఖ్యమంత్రులు కావడంలో శరద్ స్ట్రాటజీలు చాలా అద్భుతంగా పని చేశాయి
- tony bekkal
- Published On : January 13, 2023 / 08:06 PM IST
Sharad Yadav is a socialist stalwart
Sharad Yadav: పార్టీలో ఎవరినైనా పార్టీ అధ్యక్షుడు తొలగిస్తాడు. కానీ విచిత్రంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేశారు. ఆ పార్టీ జనతాదళ్ సెక్యూలర్ అయితే, ఆ అధ్యక్షుడు శరద్ యాదవ్. ఇందులో మరో గమ్మత్తైన విషయం ఏంటంటే, జేడీయూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే. లోహియా ఆలోచనలతో ఇంజనీరింగ్ వదిలి రాజకీయ ఆరంగేట్రం చేసిన శరద్ యాదవ్.. తన రాజకీయ జీవితాన్ని పూర్తిగా ఓబీసీల సామాజిక న్యాయం కోసమే ఖర్చు చేసిన నిఖార్సైన రాజకీయ వేత్త. అనేక టోపీలు మార్చారనే బలమైన విమర్శ ఉన్నప్పటికీ, అదంతా తను నమ్మిన సిద్ధాంతాల కోసమేనని ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.
Shankar Mishra: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో కొత్త కోణం
రాజకీయ ప్రయోజనాల కోసం పోకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి శరద్ యాదవ్ అనేది తరుచుగా వినిపించే మాట. రాజీవ్ గాంధీ నుంచి లాలూ వరకు చాలా మంది నేతలపై పోటీకి దిగారు. జనతాదళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ, తన పార్టీ అధికారంలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి కుర్చీవైపు కన్నేత్తి చూడని నేత. లాలూ, నితీశ్ వంటి నేతలు ముఖ్యమంత్రులు కావడంలో శరద్ స్ట్రాటజీలు చాలా అద్భుతంగా పని చేశాయి. దేశ రాజకీయాల్ని పూర్తిగా మార్చేసిన మండల్ కమిషన్ను విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం అమలులో శరద్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. ఇదే కాకుండా మహిళా రిజర్వేషన్ల అమలుకు యూపీఏ-2 ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తెచ్చారు. ఓబీసీల సామాజిక-ఆర్థిక పరిస్థితుల మీద కులగణన చేయాలని తరుచూ డిమాండ్ చేస్తుండే వారు. రాజకీయ పార్టీలను కన్విన్స్ చేయడంలో కూడా దిట్ట. కాంగ్రెస్కు వ్యతిరేకంగా జనతా పార్టీతో కూటమి ఏర్పాటులో ఈయనదే కీలక పాత్ర పోషించారు.
Sharad Yadav: శరద్ యాదవ్ చొరవ చూపకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదు
అతి ఎక్కువ కాలం పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నాయకుల్లో శరద్ యాదవ్ ఒకరు. మొత్తం ఏడుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. అయితే మూడుసార్లు తన సభ్యత్వానికి మధ్యలోనే రాజీనామా చేశారు. ఈయన అనేకమార్లు రాజీనామా చేశారు. వివిధ పదవుల్లో పదిసార్లకు పైగానే రాజీనామా చేశారు. సోషలిజం అంటే కులం, డబ్బు, రాజకీయమన్నట్లు రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. కానీ ఆ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకోవడమే కాకుండా అంతే బాగా వివరించిన నేతల్లో శరద్ యాదవ్ ప్రముఖుడు. సోషలిస్ట్ నేతే అయినప్పటికీ భారతీయ జనతా పార్టీతో ఈయనకు సుదీర్ఘకాలం స్నేహం ఉంది. అటల్ బిహార్ వాజీపేయి ప్రభుత్వంలో ఈయన కేంద్ర విమానయాన మంత్రిగా పని చేశారు. అలాగే ఎన్డీయే కన్వీనర్గా కూడా పని చేశారు. అయితే ఒక సందర్భంలో ఎన్డీయే కన్వీనర్ పదవికి కూడా రాజీనామా చేశారు. కమల దళంలో మండల్ దూతగా ఈయనకు పేరుండేది. మండల్ కమిషన్ విషయంలో బీజేపీ నేతల్ని సైతం ఈయన కన్విన్స్ చేశారని అంటారు. అయితే మండల్ కమిషన్ అమలు అనంతరం బీజేపీ వ్యతిరేకించింది.
OPS: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. పాత పెన్షన్ విధానికి కేబినెట్ ఆమోదం
చాలా రోజులపాటు బీజేపీతో స్నేహం చేసినప్పటికీ ఉన్నట్టుండి ఆ పార్టీకి బద్ధవ్యతిరేకి అయ్యారు. దీంతో 2017లో బీజేపీతో నితీశ్ కలవడాన్ని కారణంగా చూపి, జేడీయూకి రాజీనామా చేశారు. ఆ తర్వాత, రాజకీయాల నుంచి దాదాపు కనుమరుగయ్యారు. ఆర్జేడీలో చేరినప్పటికీ, ఆయనెక్కడా పెద్దగా కనిపించలేదు. లోహియా సిద్ధాంతాలను పూర్తిగా ఆవాహనం చేసుకుని రాజకీయ చరమాంకం వరకు పాటించిన నేత శరద్ యాదవ్. కుటుంబ సభ్యుల్ని ఎవర్నీ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. పదవుల కోసం ఆశపడలేదు. తనను తాను సోషలిస్టుగా ప్రకటించుకుని రాజకీయం ప్రారంభించిన ఆయన చివరి శ్వాస వరకు నిఖార్సైన సోషలిస్ట్ నాయకుడిగా జీవితాన్ని గడిపారు.
