వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు రానున్న క్రమంలో ప్రజలంతా సమన్వయం పాటించాలని ఎటువంటి ఆర్భాటాలకు పోకూడదనే సూచనలు వెలువడ్డాయి. తీర్పు ఎలా వచ్చినా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉండేలా వ్యవహరించాలని ప్రధాని మోడీతో సహా పలువురు సూచించారు. ఈ క్రమంలో తీర్పు వెలువడిన అనతరం పటాకులు కాల్చిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని మీరట్లో కొందరు యువకులు పటాకులు కాల్చారు. అయోధ్య కేసు తీర్పు వెలువడనున్న క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మీరట్లో 144 సెక్షన్ విధించారు. అయినా సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఆరుగురు యువకులు పటాకులు కాల్చారు. దీంతో ఆ ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోహ్రబ్గేట్ బస్టాండ్ వద్ద ముగ్గురిని, బ్రహ్మంపురి వద్ద మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
వీరిలో ముగ్గురు యువకులు నౌచండి ప్రాంతంలో నివసించే అపూర్వా, సురేంద్ర, ప్రవీణులుగా గుర్తించారు. మీరట్ లోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని పాండవ్ నగర్ నివాసించే లక్ష్మణ్ సింగ్ ను రెచ్చగొట్టే ఫేస్ బుక్ పోస్ట్ చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు.