Manmohan Singh Birthday Special: దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈరోజు 91వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా మాజీ ప్రధానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారా స్పందిస్తూ.. ‘‘మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ మరిన్ని ఎక్కువ రోజులు ఆరోగ్యకరమైన జీవితం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం మన్మోహన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మరి మాజీ ప్రధాని మన్మోహన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో జన్మించారు. ఈ జిల్లా ఇప్పుడు పాకిస్థాన్లో ఉంది. ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి ముందు, ఆయన 1982 నుంచి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. మాజీ ప్రధాని నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1991లో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకురావడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఆయన వల్లే దేశంలో ‘లైసెన్స్ రాజ్’ అంతరించిపోయిందని అంటారు.
బ్రిటన్లో చదువు
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేశారు. ఆయన దేశంలోని గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాదు, అద్భుతమైన ఆర్థికవేత్తగా కూడా గుర్తింపు పొందారు. పంజాబ్ యూనివర్శిటీలో చదివి, తదుపరి విద్య కోసం బ్రిటన్ వెళ్లారు. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్లో ఎకనామిక్స్ డిగ్రీ పొందారు. మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాస్త్రంలో చాలా ఆసక్తి ఉండేది.
మాజీ ప్రధాని మన్మోహన్ 1962లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో డి.ఫిల్ పూర్తి చేశారు. ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. UNCTAG సెక్రటేరియట్లో కొంతకాలం పనిచేసిన తర్వాత, 1987 నుంచి 1990 మధ్య జెనీవాలో సౌత్ ఆఫ్రికా కమిషన్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు.
అనేక కీలక పదవులు
మన్మోహన్ సింగ్ 1970 నుంచి 1980 మధ్య భారత ప్రభుత్వంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (1972-76), రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ (1982-85), ప్రణాళికా సంఘం ఛైర్మన్ (1985-87) గా పనిచేశారు. 1991 నుంచి 1996 మధ్య దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.