Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఇటీవల బ్లూ డ్రమ్స్లో ఓ వ్యాపారవేత్త శరీరభాగాలు ఛిద్రమై ఉన్న స్థితిలో కనపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కొడుకే ఈ దారుణానికి పాల్పడ్డాడని తేల్చారు. నిందితుడిని లక్నోలో అరెస్టు చేశారు. అతడిని విచారించగా మరిన్ని సంచలన విషయాలు తెలిశాయి.
ఫార్మాస్యూటికల్, మద్యం వ్యాపారి మన్వేంద్ర సింగ్(50)ను అతడి కుమారుడు అక్షత్ ప్రతాప్ సింగ్ (21) అతి దారుణంగా చంపాడు. మన్వేంద్ర సింగ్ తల ఇప్పటికీ దొరకలేదు. మన్వేంద్ సింగ్ మోకాళ్ల కింద కాళ్లు కోసి, రెండు చేతులు నరికేసి, తలను శరీరం నుంచి వేరు చేశాడు అక్షత్ ప్రతాప్ సింగ్. తర్వాత శరీర భాగాలను సంచిలో పెట్టి నీలి డ్రమ్లో దాచాడు.
దాన్ని కూడా కాల్చి పూర్తిగా నాశనం చేయాలని భావించి, 10 లీటర్ల కిరోసిన్ను కూడా ముందే తెచ్చుకున్నట్టు తెలిసింది. ఈ భయానక దృశ్యాన్ని నిందితుడి సోదరి చూసినట్టు సమాచారం. ఆమెను బెదిరించి, ఎవరికీ చెప్పొద్దని అన్నాడు.
ఆధారాలు లేకుండా చేయాలని..
లక్నో అశియానా ప్రాంతంలో ఫిబ్రవరి 20 తెల్లవారుజామున తన తండ్రిని అక్షత్ ఆగ్రహావేశంలో కాల్చి చంపినట్టు తెలుస్తోంది. హత్య విషయాన్ని దాచేందుకు మూడో అంతస్తు నుంచి శరీరాన్ని కింద అంతస్తులో ఖాళీ గదికి తీసుకెళ్లాడు.
శరీరాన్ని ముక్కలుగా చేయడానికి యంత్రాన్ని వాడినట్టు సమాచారం. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు తన తండ్రి కనిపించడంలేదని ఫిర్యాదు కూడా ఇచ్చాడు. దర్యాప్తులో అక్షత్ ప్రతాప్ సింగ్ను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరకు అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు.
తన కుమారుడు వైద్యుడు కావాలని మన్వేంద్ర సింగ్ కోరుకున్నాడు. అక్షత్కు చదువుపై ఆసక్తి లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. నిందితుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.