×
Ad

Sonia Gandhi : కాంగ్రెస్‌‌కు పూర్వవైభవం తెచ్చేలా.. సోనియా కీలక నిర్ణయాలు

ఆజాద్‌ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగిస్తారంటూ...

  • Published On : March 20, 2022 / 07:55 AM IST

G23

G23 Leaders : ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ కు షాక్ తెప్పించాయి. ఘోరాతి ఘోరంగా పరాజయం పాలు కావడంతో పార్టీ అధినాయకత్వం మేల్కోంది. పునర్ వైభవం సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని పార్టీ అధినేత్రి సోనియా భావిస్తున్నారు. ప్రధానంగా అసమ్మతి రాగం వినిపిస్తున్న జీ – 23 నేతలను సంతృప్తి పరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. సోనియాతో.. జీ23 గ్రూప్‌ నేత గులాం నబీ అజాద్‌ భేటీ తర్వాత.. మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసీసీలో భారీ ప్రక్షాళన, పలు అంశాలపై పరస్పర అంగీకారం కుదిరింది. దీంతో కాంగ్రెస్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.

Read More : CWC Meeting : అక్బర్ రోడ్ బ్లాక్.. గాంధీలు రాజీనామా చేయొద్దంటూ నినాదాలు

ఈ చర్చల్లో ఆజాద్‌ సూచనలకు సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కర్నాటలో పార్టీ బాధ్యతలను ఆజాద్‌కు అప్పగిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు.. కర్నాటక ఎన్నికల తర్వాత ఆజాద్‌కు అక్కడి నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారట. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మను కూడా రాజ్యసభకు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More : బెంగాల్ ఎన్నికల ప్రచారానికి G-23నేతలను దూరం పెట్టిన కాంగ్రెస్

మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడుగా ఉన్న మనీష్ తివారీకి ఏఐసీసీలో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా సుముఖత చూపించారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడాకు హర్యానా పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అలాగే గాంధీ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సబల్ కు పార్టీలో బాధ్యతలు అప్పగించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మొత్తంగా అసమ్మతి నేతల అభిప్రాయాలను, మనోభావాలను పరిగణలోకి తీసుకుంటానని ఆజాద్ కు సోనియా హామీనిచ్చారని తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.