Nitish, Lalu To Meet Sonia Gandhi: ఐదేళ్ల తరువాత.. నేడు సోనియాగాంధీతో భేటీకానున్న నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో ఆదివారం భేటీ కానున్నారు.
- Harishth Thanniru
- Published On : September 25, 2022 / 09:58 AM IST
Nitish, Lalu To Meet Sonia Gandhi
Nitish, Lalu To Meet Sonia Gandhi: 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తో ఆదివారం భేటీ కానున్నారు. ఐదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య ఇదే తొలి సమావేశం కావడం గమనార్హం. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) వ్యవస్థాపకుడు దివంగత చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా ఐఎన్ఎల్డి నేత ఒపి చౌతాలా ఆధ్వర్యంలో ఫతేహాబాద్ జిల్లాలో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు ఇరువురు నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. నితీష్ కుమార్ తో కలిసి ఢిల్లీలో సోనియాగాంధీని కలుస్తానని ఇప్పటికే లాలూ తెలిపారు.
Nitish Kumar: యూపీ నుంచి నితీశ్ జాతీయ పోరు.. అంబేద్కర్ నగర్ నుంచి పోటీ?
కాగా, ఇద్దరు నాయకులు మర్యాదపూర్వకంగా మాత్రమే సోనియాతో భేటీ కాబోతున్నారని, ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని, అందులో జాతీయస్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశం ఉండొచ్చునని తెలుస్తున్నది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
తన చివరి ఢిల్లీ పర్యటనలో నితీష్ కుమార్ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్లతో సమావేశమయ్యారు. బీహార్లో ‘మహాగత్బంధన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో పొత్తును తెంచుకుని, తేజస్వి యాదవ్కి చెందిన రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, ఇతర పార్టీలతో చేతులు కలిపిన తర్వాత నితీష్ కుమార్ ప్రతిపక్ష నాయకులతో సమావేశమయ్యారు.
గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా బీహార్లో పర్యటించి ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాల్లో భాగంగా నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్లను కలిశారు. తాజాగా నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లు సోనియాగాంధీతో భేటీకానుండటం ఆసక్తికరంగా మారింది.
