ఎస్పీ కార్యకర్తలపై మాయా ఫైర్
- venkaiahnaidu
- Published On : April 21, 2019 / 02:52 PM IST
బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో మాయావతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతున్న సమయంలో ఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.దీంతో మాయావతి ఇబ్బంది పడ్డారు. ప్రసంగం మధ్యలో నినాదాలు, అరుపులు చేస్తున్నారు. మీరు బీఎస్పీ కార్యకర్తల నుంచి చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను.తాను మాట్లాడేటపుడు బీఎస్పీ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా వింటారని మాయావతి అన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ,కాంగ్రెస్ లపై మాయావతి విమర్శలు గుప్పించారు. మీడియా, ఒపీనియన్ పోల్స్, సర్వేల పేరుతో పార్టీలన్నీ తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ మాయలో పడవద్దని మాయావతి ప్రజలను కోరారు. ఓటర్లు తప్పుదోవ పట్టకూడదన్నారు.
