పృథ్వీ-2 మిసైల్ నైట్ ట్రయిల్ విజయవంతం
- venkaiahnaidu
- Published On : October 16, 2020 / 10:04 PM IST
night trial of nuclear-capable Prithvi-2 missile దేశీయంగా అభివృద్ధి చేసిన పృథ్వీ-2 మిసైల్ నైట్ ట్రయిల్ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) భారత్ విజయవంతంగా నిర్వహించింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణిని రాత్రి వేళ ప్రయోగంలో భాగంగా ఒడిశా తీరంలో బాలసోర్ దగ్గర్లోని చండీపూర్ లోని ఇంటిగ్రెటెట్ టెస్ట్ రేంజ్(ITR) నుంచి రాత్రి 7:30గంటలకు పరీక్షించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్లో ఇప్పటికే భాగమైన ఈ క్షిపణి పరీక్షను మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఢిఫెన్స్ అధికారులు తెలిపారు.
రెండు ఇంజిన్లు కలిగి..ద్రవ ఇంధనంతో నడిచే పృథ్వీ -2 క్షిపణి 250 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. 500-100కేజీల బరువుగల వార్హెడ్స్ ను మోయగలదు. దేశీయంగా తయారు చేసిన ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించగల తొలి వ్యూహాత్మక క్షిపణి ఇది.
మరోవైపు, పృథ్వీ -2 క్షిపణిని రాత్రి వేళలో పరీక్షించడంతో మూడు వారాల్లో ఇది రెండోసారి. సెప్టెంబర్ 27న డీఆర్డీవో చాలా రహస్యంగా ఈ అణు క్షిపణి రౌండ్ నైట్ ట్రయల్ నిర్వహించింది. కాగా డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఉపరితలం నుండి ఉపరితల లక్ష్యాలను ఛేదించే క్షిపణులను 40 రోజుల్లో ఇప్పటి వరకు 11 సార్లు పరీక్షించారు. వీటిలో అన్ని విజయవంతం కాగా ఒక్క నిర్భయ్ క్రూయిజ్ క్షిపణి మాత్రమే చివరి నిమిషంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఈ సమయంలో శుక్రవారం రాత్రి వేళ నిర్వహించిన ట్రయల్స్లో పృథ్వీ -2 క్షిపణి అన్ని పరిమితులను చేరుకున్నదని, నైట్ ట్రయల్ విజయవంతమైందని అధికారులు తెలిపారు.
