నిర్భయ దోషులను ఒక్కొక్కరుగా ఉరి తీయాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.
నిర్భయ దోషులను ఒక్కొక్కరుగా ఉరి తీయాలంటూ కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టి నలుగురు దోషులకు నోటీసు జారీ చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. నిర్భయ దోషులకు న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఢిల్లీ హైకోర్టు వారం రోజుల సమయం ఇచ్చిందని కోర్టు గుర్తు చేసింది. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది.
ముకేశ్, వినయ్ శర్మ, అక్షయ్కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనలను రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ఇదివరకే తిరస్కరించారు. ఇక నలుగురు దోషుల్లో మిగిలిన పవన్ గుప్తా మాత్రం ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్ను దాఖలు చేయలేదు. తొలుత ఉరి అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ కేంద్రం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా దాన్ని కోర్టు బుధవారం తిరస్కరించింది. నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయడం కుదరదని.. నలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నలుగురు దోషుల్లో కనీసం ఇద్దరిని ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం తన పిటిషన్లో పేర్కొంది. దోషులందరినీ ఒకేసారి ఉరితీయాలని అధికారులకు సూచిస్తూ.. శిక్ష అమలు నిలుపుదల కోసం వారం రోజుల్లోగా తమకు ఉన్న చట్టపరమైన అన్ని అవకాశాలను దోషులు వినియోగించుకోవాల్సిందిగా గడువునిచ్చింది. అనంతరం అధికారులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు సూచించింది.
మరోవైపు నిర్భయ కేసులో దోషులుగా ఉన్న నలుగురికి కొత్త డెత్వారెంట్లు జారీ చేయాల్సిందిగా తీహార్ జైలు అధికారులు ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించారు. నిర్భయ దోషులకు డెత్వారెంట్లు జారీ చేయాలని తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో పటియాలా కోర్టు విచారించనుంది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు డెత్ వారెంట్లు జారీచేయాలని తీహార్ జైలు అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. నలుగురు దోషుల పిటిషన్లు ఎక్కడ కూడా పెండింగ్లో లేనందున శిక్ష అమలు తేదీని ఖరారు చేయాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై కాసేపట్లో పటియాలా కోర్టు విచారణ జరపనుంది.