Supreme Court to hear pleas challenging Citizenship Amendment Act on September 12
CAA: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని-2019 (సీఏఏ) సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబర్ 12న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. సీఏఏపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వేసే పిటిషన్లకు 2020లో అప్పటి సీజేఐ జస్టిస్ బోబ్డే అనుమతి ఇచ్చారు. కాగా, 200లకు పైగా వచ్చిన ఈ పిటిషన్లపై సీజేఐ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణకు తీసుకోనుంది.
అయితే చాలా రోజుల క్రితమే ఈ చట్టంపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. సవరణ అనంతరం దేశంలోని ఏ ఒక్కరి ప్రాథమిక హక్కునూ సీఏఏ భంగం కలిగించదని తమ అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. సీఏఏ భారత పౌరులలో ఎవరికైనా చట్టపరమైన, ప్రజాస్వామ్య లేదా లౌకిక హక్కులను ప్రభావితం చేయదని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కాగా, ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చే ముస్లింలు మినహా మిగతావారందరికీ పౌరసత్వం ఇస్తామని బిల్లులో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీసింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా భారతదేశ పొరుగు ముస్లిం మెజారిటీ దేశాలలోని ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అందించడానికి సీఏఏ కట్టుబడి ఉంది. డిసెంబర్ 31, 2014 లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించినవారు భారత పౌరులుగా సభ్యత్వం పొందేందుకు అర్హులని సీఏఏ చెబుతోంది.
ఈ విషయమై దేశ వ్యాప్తంగానే ఆందోళనకు చెలరేగాయి. కేంద్రంలోని బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఒక మతాన్ని విస్మరిస్తోందని, విధ్వేషం చూపిస్తోందని ముస్లింలు సహా అనేక మంది ఆందోళనలు నిర్వహించారు. ఢిల్లీలోని షహీన్బాగ్లో కొనసాగిన దీర్ఘకాలిక ఆందోళన గుర్తుండే ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో కొవిడ్ మహమ్మారి విజృంభించింది. అప్పటి నుంచి ఈ విషయమై బహిరంగ ఆందోళనలు ఆగిపోయాయి.